జహీరాబాద్, జనవరి 20 : భవిష్యత్ ఆహారం చిరుధాన్యాలే అని, చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగిందని గ్రామ సర్పంచ్ కమిలిబాయి తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ మండలంలోని లచ్చినాయక్తండా గ్రామ పరిధిలోని జీడిగడ్డ తండాలో నిర్వహించిన పాత పంటల జాతరలో పలువురు పాల్గొని మాట్లాడారు. వర్షధారంగా చిరుధాన్యాలు పండించడంతో పాటు భూమిలో పోషకాలు పెరుగుతున్నాయని వివరించారు. చిరుధాన్యాలను పేద రైతులు ఎలాంటి రసాయనలు లేకుండా సేంద్రియ (పశువుల) ఎరువులతో పండిస్తున్నారన్నారు. ప్రపంచ దేశంలోనే చిరుధాన్యాలకు భవిష్యత్ వచ్చిందని, చిరుధాన్యాల సాగును పెంచేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. డీడీఎస్ సంస్థ చేస్తున్న చిరుధాన్యాల జాతరకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. హైదరాబాద్కు చెందిన అరణ్యవిద్యా సంస్థ విద్యార్థులు పాత పంటల జాతలో పాల్గొని చిరుధాన్యాల సాగు, పండించే విధానం తెలుసుకున్నారు. విద్యార్థులు గిరిజన మహిళా రైతులతో కలిసి ఆటపాటలతో ముందుకు సాగారు. జాతరలో డీడీఎస్ మహిళలు విజయలక్ష్మి, చుక్కమ్మ, నర్సమ్మ, వినయ్కుమార్, కమిలిబాయి, మాణిక్యం పాల్గొన్నారు.