హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ‘ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్.. జాబ్ అప్లికేషన్ ఫారం కూడా నింపలేరు’ అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు తీవ్రం దుమారం లేపాయి. సీఎం వ్యాఖ్యలను విద్యార్థి సంఘాల నేతలు, పరిశోధక, సాంకేతిక విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించడం మానుకుని, ఇంజినీరింగ్ విద్యలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అవుతుంటే రెండున్నరేండ్లు సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేశారు? లోపాలుంటే ఎందుకు సరిదిద్దలేదని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. పరిశోధక విద్యార్థి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదని హెచ్చరించారు. నైపుణ్యాల లోపాన్ని సవరించాల్సిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటంపై విచారకరమని పేర్కొన్నారు.
రేవంత్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దాఖలు చేసిన కోర్టు పిటిషన్లు, ఆర్టీఐ దరఖాస్తులు రేవంత్రెడ్డే స్వయంగా రాశారా? అని ప్రశ్నించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు కాదు.. రేవంత్రెడ్డే క్రిమినల్ వేస్ట్ అని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ తానే రాశారా? అక్షర దోషం లేకుండా మెంబర్ ఆఫ్ లెజిస్టేటివ్ అసెంబ్లీ, చీఫ్ మినిస్టర్ అని ఇంగ్లిష్లో రాయగలరా? అని ప్రశ్నించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో స్టార్టప్ హబ్గా ఉన్నదంటే అందుకు కారణం ఇంజినీరింగ్ విద్యార్థులే అన్నది గుర్తుంచుకోవాలని సూచించారు. మరోసారి ఇలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఇంజినీరింగ్ విద్యలో సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి విద్యార్థులపై నిందలేయడం సరికాదని దుర్గాప్రసాద్ అనే బీటెక్ విద్యార్థి పేర్కొన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. దేశ, రాష్ట్ర నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచేలా సీఎం మాట్లాడటం అత్యంత హేయమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం వారు హైదరాబాద్లో మాట్లాడుతూ.. ఒకవైపు వేదికలపై మాట్లాడేటప్పుడు జెన్-జీకి గౌరవం ఇవ్వాలని, వారి శక్తిసామర్థ్యాలను వినియోగించుకోవాలని చెప్తూనే, మరోవైపు ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ పేర్కొనడం రేవంత్రెడ్డి ద్వంద్వనీతికి నిదర్శనమని మండిపడ్డారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అన్న సీఎం వ్యాఖ్యలపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూట్స్(ఫతి) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ మేరకు ఫతి చైర్మన్ ఎన్ రమేశ్బాబు, సెక్రటరీ జనరల్ రవికుమార్, కోశాధికారి కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కే సునీల్కుమార్ మాట్లాడుతూ.. మన విద్యార్థుల మేధస్సుతో ఐదు వేలకు పైగా కంపెనీలు, స్టార్టప్లు అవతరించాయని పేర్కొన్నారు. యువతను ప్రోత్సహించాల్సిందిపోయి, వారిని మానసికంగా దెబ్బతీయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, విద్యార్థిలోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
రాత్రింబవళ్లు శ్రమిస్తూ సాంకేతిక విజ్ఞానాన్ని సముపార్జిస్తున్న భావిభారత నిర్మాతలను ప్రోత్సహిస్తూ అభినందించాల్సిందిపోయి, అభాండాలు వేయడం సీఎం అహంకారానికి, అవివేకానికి నిదర్శమని శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నైతిక విలువలను విస్మరించి అహంకారంగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పకుంటే విద్యార్థిలోకం తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు.
ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అని సీఎం రేవంత్రెడ్డి అనడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించమని అడుగుతున్నారనే అక్కసుతో వారిని క్రిమినల్స్తో పోల్చడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిల్లో రూ.5వేల కోట్లు ఇంజినీరింగ్ విద్యార్థులకే చెల్లించాల్సి ఉన్నదని, ఈ బకాయిలు చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేయడాన్ని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో సీఎం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.