సికింద్రాబాద్, ఫిబ్రవరి 24 : మాదకద్రవ్యాల నియంత్రణకు నగర పోలీసులు బహుముఖ వ్యూహంతో ముందుకుసాగుతున్నారు. మొదటి వ్యూహంలో భాగంగా ఇప్పటికే మత్తుకు బానిసైన వారిని గుర్తించి, వారి కుటుంబసభ్యుల సహకారంతో డీ అడిక్షన్ కోసం కార్యాచరణ రూపొందించారు. రెండో వ్యూహంలో.. డ్రగ్స్ వినియోగానికి ఆకర్షితులవుతున్న యువతను గుర్తించి, వారికి అందుతున్న డ్రగ్ నెట్వర్క్ లింక్ను గుర్తించి, నిర్మూలించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా విద్యార్థులే లక్ష్యంగా మత్తు దందా విశృంఖలంగా సాగుతుండడంతో నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పలుచోట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. తాజాగా గురువారం నార్త్జోన్ పోలీసుల ఆధ్వర్యంలో కంటోన్మెంట్ క్లాసిక్గార్డెన్స్లో అవగాహన సదస్సు జరిగింది. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, నగర సీపీ సీవీ ఆనంద్, నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి, సినీ దర్శకుడు కొరటాల శివ, హాస్యనటుడు శ్రీనివాస్రెడ్డి, జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. హెరాయిన్, కొకైన్, ఓపీఎం, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చక్కటి భవిత కండ్లముందే ఆగమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ కళాశాలల్లో ఇలాంటి అవగాహన సదస్సులు మరిన్ని నిర్వహించాలని పలువురు అభిప్రాయపడ్డారు. విద్యార్థులపై 75 శాతం పర్యవేక్షణ తల్లిదండ్రులకే ఉండాలని సూచించారు.
ఉరకలెత్తాల్సిన వయసులో శక్తి నిర్వీర్యమవుతుంది.. ఆలోచన సన్నగిల్లుతుంది.. చదువుకోవాలన్న ధ్యాస తగ్గిపోతుంది.. చేస్తున్న పనిపై ఏకాగ్రత తప్పుతుంది.. కుటుంబబాంధవ్యాలు దూరమవుతాయి..ఏకంగా మనిషి నడవడికే దారితప్పుతుంది.. ఇదీ డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల బారిన పడిన వారి అవస్థలు. తెలిసి తెలియకో, స్నేహితుల ఒత్తిడి మేరకో, ఒకసారి తీసుకుంటే ఏమవుతుందిలే..అని సరదాగా మత్తుకు అలవాటై చివరకు వాటికి బానిసవుతున్నారు. మత్తు నుంచి బయటపడలేక నిండుజీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు. డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో నగర పోలీసులు సరఫరా, విక్రయం, వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటూనే మరోవైపు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. గురువారం నార్త్జోన్ పోలీసుల ఆధ్వర్యంలో కంటోన్మెంట్ క్లాసిక్గార్డెన్స్లో జరిగిన కార్యక్రమానికి యువత భారీగా హాజరైంది.
-సికింద్రాబాద్, ఫిబ్రవరి 24
మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో నష్టాలున్నాయి. కుటుంబాలే నాశనమవుతాయి. పిల్లలు ఇంట్లో నుంచి పార్టీలకు వెళ్తున్నారంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. చాలామంది యువకులు తోటివారి ఒత్తిడికి గురై మాదకద్రవ్యాలను అలవాటు చేసుకుంటున్నారు. యువత, విద్యార్థులు మేల్కొని తమ కాలనీల్లో మాదకద్రవ్యాలకు ‘నో’ అంటూ విస్తృత ప్రచారం చేయాలి. డ్రగ్స్ నియంత్రణకు బహుముఖ వ్యూహాలతో ముందుకెళ్తున్నాం. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో మొదటి సారి హెచ్-న్యూ విభాగాన్ని ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు, వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్ హాట్స్పాట్లను ఇప్పటికే గుర్తించాం. పటిష్ట నిఘా కొనసాగుతుంది. హైదరాబాద్ను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో పోలీసులు చేస్తున్న ప్రయత్నానికి మద్దతివ్వాలి.
-సీవీ ఆనంద్, నగర సీపీ
గంజాయి, గుట్కా, మత్తు పదార్థాల సరఫరాపై ఇప్పటికే నార్త్జోన్ పరిధిలో ప్రత్యేక నిఘా పెట్టాం. సీఎం కేసీఆర్, సీపీ ఆదేశాలతో మత్తు పదార్థాల సరఫరాను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే నష్టాలపై ఇటీవలి కాలంలో విస్తృతంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గంజాయి నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత. డ్రగ్స్ నివారణకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా పాఠశాలలు, కళాశాలల్లో కూడా అవగాహన కల్పించే దిశగా ముందుకు సాగుతున్నాం. – చందనాదీప్తి, డీసీపీ, నార్త్జోన్
బేగంపేట, ఫిబ్రవరి 24 : యువతకు కెరీర్ చాలా ముఖ్యమని, ఎదుగుతున్న వయసులో మత్తు పదార్థాలు, వ్యసనాల జోలికెళ్లకుండా ఆదర్శంగా ఉండాలని హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సికింద్రాబాద్ బోట్స్క్లబ్లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా యూత్ సమ్మేళనం జరిగింది. జేసీ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ యువత మంచి మార్గాన్ని ఎంచుకొని దేశం గర్వపడేలా ఉండాలని సూచించారు. విద్యతోపాటు దేశం గర్వించే స్థాయిలో పయనించాలన్నారు. కార్యక్రమంలో రాంగోపాల్పేట కార్పొరేటర్ చీర సుచిత్ర, యువ కేంద్రం ప్రతినిధులు కుమార్గుప్తా, ఈశ్వర్రావు, భీంరెడ్డి, కుష్బు తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్, ఇతర మత్తుకు అలవాటుపడి జీవితాలను చిత్తు చేసుకోవద్దు. గంజాయి వాడకాన్ని కాలేజీ విద్యార్థులు ఫ్యాషన్గా అలవాటు చేసుకుంటున్నారు. నేను రచయితగా జీవితం ప్రారంభించినప్పుడు ఫ్యాషన్గా సిగరెట్లు తాగేవాడిని. ఓ సందర్భంలో దర్శకుడు సన్నివేశం బాగాలేదని, తిరిగి మార్పు చేయాలని సూచించడంతో రాత్రంతా కూర్చొని రాసినా కుదరలేదు. అయితే అప్పటికప్పుడు సన్నివేశం రాయాల్సి రావడంతో గంటలో 18 సిగరెట్లు తాగిన. అప్పుడు ఛాతిలో కొంచెం నొప్పి వచ్చింది. డాక్టర్ వద్దకెళితే వెంటనే సిగరెట్లు మానెయ్యమని చెప్పారు. మానకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. 30 ఏళ్ల నుంచి సిగరెట్కు దూరంగా ఉంటున్నా. జీవితం చాలా విలువైనది.
-తనికెళ్ల భరణి, సినీనటుడు
రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఒకసారి డ్రగ్స్కు బానిసయితే చావే శరణ్యం. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీసే డ్రగ్స్ను కలిసికట్టుగా అడ్డుకుందాం. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే పోలీసులు ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దు. -తలసాని శ్రీనివాస్యాదవ్, మంత్రి
యువత చెడు వ్యసనాల బాట పట్టొద్దు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రేతలు వాళ్ల అవసరాల కోసం మీతో సన్నిహితంగా మెలుగుతారు. యవత దీన్ని గుర్తెరగాలి. మత్తుకు బానిసలుగా మారి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులు పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలి. ఒకసారి అలవాటైతే మహమ్మారి వదిలిపెట్టదు. వదిలించుకోవడం చాలా కష్టం. -సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్
ఫ్యాషన్ కోసం కొందరు డ్రగ్స్కు బానిసలవుతున్నారు. దేశంలో ఎక్కువగా యువత ఉన్నది సంఖ్యలో కాదు. బలంలో కావాలి. నగర పోలీసులు డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉంది. ఇక్కడకొచ్చిన యువత మీ ప్రాంతాల్లోని వారికి డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించాలి. డ్రగ్ ఫ్రీగా సిటీగా తీర్చిదిద్దుదాం.
-కొరటాల శివ, సినీదర్శకుడు
డ్రగ్స్ కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరమైనవి. విద్యార్థులు,యువత పాలిట పెనుశాపంగా మారుతున్నాయి. మత్తుకు బానిస కాకుండా ఉజ్వల భవిష్యత్ కోసం యువత తపనపడాలి. కరోనా వైరస్నే తట్టుకొని ముందుకుసాగుతున్నాం. డ్రగ్స్ను సమాజం నుంచి పారదోలి బంగారు భవిష్యత్కు బాటలు వేసుకుందాం.
-శ్రీనివాస్రెడ్డి, సినీ హాస్యనటుడు
విద్యార్థులు,యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. ఏదో ఒక క్షణికావేశంలో డ్రగ్స్ బారిన పడుతారు. అలవాటై బయటపడే మార్గం లేక బానిసవుతారు. వాటి నుంచి తప్పించుకోలేం. మనమంతా నాగరికులం. డ్రగ్స్కు దూరంగా ఉంటే లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. లక్షలు సంపాదించే మార్గాలున్నా, మంచి మార్గంలో వెళ్లాలంటే మంచి లక్షణాలు ఉండాలి. -నైనా జైస్వాల్, క్రీడాకారిణి
మత్తుకు అలవాటు పడి యువత పెడదోవపడుతోంది. పాశ్చాత్య సంస్కృతిని వీడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తల్లిదండ్రుల ఆశయాలకు తగినట్లు నడుచుకుంటూ ప్రయోజకులుగా ఎదగాలి. సరదాకు అలవాటైన వ్యసనాలు జీవితాన్ని అంధకారం చేస్తాయి. మత్తుకు బానిసైన వారు మానసిక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకుంటే విముక్తి పొందవచ్చు. – డాక్టర్ విరించి శర్మ, మానసిక వైద్య నిపుణులు
అవగాహన కార్యక్రమంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్ర్పరిణామాలు తెలుసుకున్నా. అంతకుముందు నాకు తెలియదు. వీటి వాడకం వల్ల జరిగే నష్టాలను పోలీసు ఉన్నతాధికారులు, అతిథులు తెలియజేసిన తీరు బాగుంది. మా పాఠశాల నుంచి సుమారు 50 నుంచి 60 మంది ఈ కార్యక్రమానికి వచ్చినం. డ్రగ్స్, మత్తుపదార్థాల నియంత్రణకు తమవంతు కృషి చేస్తాం. – భవిక్యాదవ్,రెయిన్బో హైస్కూల్
మత్తు పదార్థాలకు బానిసలై విద్యార్థులు బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు. దేశ భవిష్యత్ యువత, విద్యార్థుల చేతుల్లో ఉంది. కష్టపడే దశలో కేవలం విద్య మీదే దృష్టి సారించి ఉన్నతస్థితికి ఎదగాలి. యూత్ అల్లరి చేయాలి కానీ అల్లరి పాలు కావొద్దు. యువత చెడుమార్గంలో నడవకుండా సన్మార్గంలో నడిచి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. డ్రగ్స్ ఫ్రీ సిటీగా నగరాన్ని మారుద్దాం.
-శ్రీరామచంద్ర, గాయకుడు
మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు. తల్లిదండ్రులు పిల్లలను చెడు వ్యసనాల బారిన పడకుండా చూసుకోవాలి. ఉన్నత చదువులు చదువుకొని మంచి గుర్తింపు పొందాలి. డ్రగ్స్కు బానిసలు కాకుండా కెరీర్పై దృష్టి సారించాలి. అనంతరం డ్రగ్స్పై యువతకు పాట రూపంలో ఆలపించగా ఆకట్టుకుంది.
-రాహుల్ సిప్లిగంజ్, సింగర్
నార్త్జోన్ పోలీసులు డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించడం సంతోషకరం. యువత పెడదోవ పట్టకుండా చైతన్యం తీసుకరావడం మంచి పరిణామం. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు సరఫరా చేసే వారిపై కఠినచర్యలు తీసుకోవాలి. మా ప్రాంతంలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం.
-బాల్రాజ్, రెయిన్బో హైస్కూల్, ఓల్డ్ బోయిన్పల్లి