జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి పర్యటించిన సీపీ
NIZAMABAD CP | వినాయక నగర్, మార్చి 28 : శాంతి భద్రతలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పోలీసు అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని పలు సున్నితమైన ప్రాంతాలలో ఆయన గురువారం అర్ధరాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల ద్వారా పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు మైనారిటీ ఏరియాలో వ్యాపారస్తులతో ఆయన స్వయంగా మాట్లాడుతూ పలు అంశాలపై చర్చించారు.
నిజామాబాద్ నగరంలోని టౌన్-1, టౌన్-2 పరిసర ప్రాంతాలలో ముస్లిం సోదరులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా జమా మసీద్, బర్కత్ పుర కాలనీ, మాలపల్లి, ఆటోనగర్, హైమదీ బజార్ ప్రాంతంలోని శంభునిగుడి, గాజులపేట్ ఏరియాలోని గురుద్వారా తదితర ప్రాంతాల్లో సీపీ స్వయంగా నడుచుకుంటూ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల నిర్వహణ, పెట్రోలింగ్ విధానాన్ని పరిశీలించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.