సిరిసిల్ల : చిట్ఫండ్స్ కంపెనీల్లో ఖాతాదారుల చెల్లింపు విషయంలో ఇబ్బందులకు గురి చేసినా, మోసాలకు పాల్పడితే సదరు కంపెనీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలుంటాయని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. జిల్లా పరిధిలోని చిట్ఫండ్ సంస్థలు గడువు తీరినా ప్రజలు చెల్లించాల్సిన డబ్బు చెల్లింపు విషయంలో జాప్యం చేయడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
మధ్య తరగతి ప్రజలే చిట్ఫండ్ సంస్థల్లో డబ్బు పొదుపు, డిపాజిట్ల రూపంలో దాచుకుంటున్నారన్నారు. డిపాజిట్ల గడువు, నెలవారీ వాయిదాల చెల్లింపు పూర్తయిన అనంతరం.. తిరిగి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడంలో ఇబ్బందులకు గురి చేయడంతో పాటు మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. ఆయా సంస్థలకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్లలో భూములు కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.
ఖాతాదారులకు డబ్బులు తిరిగి చెల్లించకుండా మోసం చేస్తున్నారని, పలు సంస్థల యాజమాన్యం, సిబ్బంది బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఇకపై చిట్ఫండ్ సంస్థలపై ఎలాంటి ఫిర్యాదులు అందినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యాజమాన్యాలు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని, గడువు తీరిన అనంతరం ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించాలని సూచించారు. ప్రజల డబ్బుకు భద్రత కల్పించడమే పోలీసుల లక్ష్యమని పేర్కొన్నారు.