బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల దన్నుతో దూసుకుపోయిన సూచీ
ముంబై, జనవరి 5: నూతన సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ 2022లో వరుసగా నాలుగోరోజు భారీగా లాభపడటంతో సెన్సెక్స్ మళ్లీ 60 వేల పాయింట్ల మార్క్ను అధిగమించింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ బుధవారం కూడా భారీగా లాభపడింది. ఐటీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పటికీ సెన్సెక్స్ 367.22 పాయింట్లు అందుకొని 60,223.15 వద్ద ముగిసింది. గతేడాది నవంబర్ 17 తర్వాత సూచీ మళ్లీ 60 వేల పైకి చేరుకోవడం ఇదే తొలిసారి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 120 పాయింట్లు ఎగబాకి 17,925.25 వద్ద స్థిరపడింది.
నాలుగు రోజుల్లో 9 లక్షల కోట్లు
మదుపరులు లాభాల జడివానలో తడిసి ముద్దవుతున్నారు. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 2,428 పాయింట్లు లాభపడటంతో మదుపరుల సంపద రూ.9,30,419.30 కోట్లు పెరిగి రూ. 2,72, 44,894.96 కోట్లకు చేరుకున్నది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నప్పటికీ దేశీయ సూచీలు మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయని దలాల్స్ట్రీట్ వర్గాలు
వెల్లడించాయి.