Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో కొన్ని కంపెనీల మూడో త్రైమాసిక (Quarter 3) ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో సూచీలు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 208 పాయింట్లు లాభపడి 84,065 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 67 పాయింట్ల లాభంతో 25,935 వద్ద ముగిసింది. ప్రధాన సూచీలతో పోలిస్తే బ్రాడర్ మార్కెట్లు మెరుగ్గా రాణించాయి.
నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 0.49 శాతం, ఎన్ఎస్ఈ స్మాల్క్యాప్ 100 సూచీ 0.38 శాతం చొప్పున లాభపడ్డాయి. ముఖ్యంగా మైక్రోక్యాప్ కంపెనీల షేర్లకు మంచి డిమాండ్ కనిపించింది. డిసెంబర్ త్రైమాసికంలో బలమైన ఫలితాల నేపథ్యంలో నిఫ్టీ మైక్రోక్యాప్ 250 సూచీ ఏకంగా ఒక శాతం పెరిగింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) కొనుగోళ్లు కొనసాగించడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ఆశలు మార్కెట్ సెంటిమెంట్కు మద్దతునిచ్చాయి.
ఫార్మా, పీఎస్యూ బ్యాంక్ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ట్రేడయ్యాయి. నిఫ్టీ మీడియా 2.40 శాతంతో అత్యధికంగా లాభపడగా, నిఫ్టీ ఆటో 1.37 శాతం పెరిగింది. మంగళవారం డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.23 శాతం బలపడి 90.52 వద్ద ముగిసింది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 42.95 పాయింట్లు స్వల్పంగా నష్టపోయి 60,626.40 వద్ద స్థిరపడింది. మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీకి తక్షణ మద్దతు 25,550–25,600 స్థాయిల వద్ద ఉన్నది.