Paddy Procurement | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలకు కూడా విలువ లేకుండా పోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. “కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసినా రైతులు ఆందోళన చెందొద్దు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశిస్తాం” అంటూ వారం రోజుల క్రితం సీఎం రేవంత్ ప్రకటించారు. స్వయంగా సీఎం ఆదేశాలను కూడా అధికారులు బేఖాతరు చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనేది లేదని తేల్చి చెప్తున్నారు. ఆరబెట్టి తీసుకొస్తేనే కాంటా పెడతామని స్పష్టంగా చెప్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం చెప్పారు కదా అని రైతులు ప్రశ్నిస్తే, అవన్నీ అనవసరమని, నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యాన్నే కొనుగోలు చేస్తామని అధికారులు తెగేసి చెప్తున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతున్నా, మొలకెత్తుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. ఏడువేలకు పైగా కేంద్రాలు ఏర్పాటు చేసి వేగంగా ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 5వేల కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిసింది.
ఎండకు ఎండి.. వానకు తడిసి
ఓ రైతు వారం రోజులు కష్టపడి ధాన్యాన్ని ఆరబెట్టాడు. కాంటా పెట్టడంలో అధికారులు ఆలస్యం చేశారు. వర్షం రావడంతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఆ ధాన్యాన్ని కాంట పెట్టాలంటే మళ్లీ ఆరబెట్టాల్సిందేనని అధికారులు చెప్పడంతో ఆ రైతు మళ్లీ ధాన్యాన్ని ఆరబెట్టాడు. తర్వాత మళ్లీ వర్షం పడి తడిసిపోయింది. రాష్ట్రంలోని మెజార్టీ కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితి ఇది. ధాన్యం ఆరబెట్టగానే కొనుగోలు చేస్తే రైతులకు ఈ ఇబ్బందులు తప్పేవి. అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల్లోని ఇతర సమస్యలు రైతులకు శాపంగా పరిణమిస్తున్నాయి.
మిల్లుల్లో చోటేదీ?
ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యానికి మిల్లుల్లో చోటు లేకపోవడం కూడా కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత యాసంగి ధాన్యం, గత వానకాలం ధాన్యంతో మిల్లులన్నీ నిండిపోయాయి. ఈ యాసంగి ధాన్యం పెట్టేందుకు చోటు లేకుండా పోయింది. మొన్నటి వరకు మిల్లర్లు ఎలాగోలా కొంత ధాన్యాన్ని దించుకున్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా చోటు లేకపోవడంతో దించుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఈ కారణంతో పలు జిల్లాల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని జిల్లాల్లో ధాన్యాన్ని అధికారులు ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొంత ధాన్యాన్ని సిద్దిపేట జిల్లాలోని మిల్లులకు తరలిస్తున్నారు.
దయనీయంగా రైతుల పరిస్థితి
ఓవైపు కొనుగోలులో ఆలస్యం, మరోవైపు వరుస వర్షాలతో అన్నదాత పరిస్థితి ఆగమాగం అవుతున్నది. వరుసగా కురుస్తున్న వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు సవాలుగా మారింది. భారీ వర్షాలకు కొట్టుకుపోతున్న ధాన్యాన్ని ఒడిసిపట్టేందుకు రైతులు పడుతున్న కష్టాలకు అంతేలేకుండా పోతున్నది. బహిరంగ ప్రదేశాల్లో ఆరబెడుతున్న ధాన్యం వర్షాలకు తడిసి ముద్దవుతున్నది. ఆ తర్వాత కూడా ఆరే పరిస్థితి లేకపోవడంతో ధాన్యం మొలకెత్తి రైతన్నకు గుండెకోత మిగిలిస్తున్నది.