హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలుగా వెంటాడిన సమస్యలకు తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారం దొరికింది. మౌలిక సదుపాయాల కల్పనతో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 2014 నుంచి గణనీయమైన మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రెండుశాఖలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు వేలకోట్ల నిధులను కేటాయించారు. కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశారు. తండాలను పంచాయతీలుగా మార్చారు.
నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చారు. పురపాలక శాఖలో కొత్త మున్సిపల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. అధికారులు, ప్రజాప్రతినిధులను జవాబుదారీ చేశారు. క్షేత్రస్థాయిలో చట్టాలు పకడ్బందీగా అమలవుతున్న ఫలితాలను తెలంగాణ ప్రతి పల్లెలోనూ చూడొచ్చు. పల్లెప్రగతి, పట్టణప్రగతి ద్వారా వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. అందుకే దేశంలోని ఇతర రాష్ర్టాలకు తెలంగాణ పల్లెలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జాతీయస్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంటున్నాయి.
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు.. రాష్ట్రంలో అనేక వర్గాలకు అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఆసరా పింఛన్లు 2014-15లో 33.90లక్షల మందికి సంవత్సరానికి రూ.1520కోట్లు ఇవ్వగా.. 2022 నాటికి 37.35లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నారు. ప్రస్తుతం ఏడాదికి రూ.8620కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి కేవలం రూ.200 ఉన్న పింఛను మొత్తాన్ని ప్రస్తుతం రూ.2016కు పెంచారు.
వికలాంగులకు ఎనిమిదేండ్ల క్రితం రూ.1,500 ఇవ్వగా ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసి నెలనెలా ఒక్కొక్కరికి రూ.3016 అందిస్తున్నది. మానవీయ కోణంలో ఆలోచించి సమాజంలో ఉండే ఒంటరి మహిళలకు ఆసరా ఫించను ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడంతోపాటు దానిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. వీరితోపాటు బీడీ కార్మికులకు, పైలేరియా బాధితులకు పింఛన్ అందిస్తున్నారు.
2014లో 2022లో
ఉపాధి హామీ జాబ్ కార్డులు 54,28,900 61,75,705
ఉపాధి హామీ పనిదినాలు 10.56కోట్లు 14.75కోట్లు
మహిళా స్వయంసహాయక సంఘాలు 3,59,067 4,30,282
స్వయంసహాయక సంఘాల్లో సభ్యులు 32,59,820 46,16,286
మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలు 3,738.67కోట్లు 2,673.04కోట్లు