హైదరాబాద్/ములుగు, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): పోడుభూముల సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రగతిభవన్లో జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమశాఖల అధికారులు పాల్గొననున్నారు. పోడు సమస్యపై సమగ్రంగా చర్చించి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. ఈ సందర్భంగా పోడుభూముల సమస్యలపై వివిధ జిల్లాల్లో అధ్యయనం చేసిన ఉన్నతాధికారుల బృందం ముఖ్యమంత్రికి నివేదికను అందజేయనున్నది. అటవీశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, సీఎం వోఎస్డీ ప్రియాంకవర్గీస్, పీసీసీఎఫ్ శోభ, అదనపు పీసీసీఎఫ్ మోహన్చంద్రతో కూడిన బృందం బుధ, గురు, శుక్రవారాల్లో వివిధ జిల్లాలను సందర్శించింది. శుక్రవారం ములుగు కలెక్టరేట్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, డీఎఫ్వోలు, రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ.. పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. పోడు సాగుదారులకు న్యాయంచేసే అంశంపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని, దానికి అనుగుణంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ఇకనుంచి ఎకరం అటవీ ప్రాంతం కూడా ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. అడవుల సంరక్షణ, హరితహారం విషయాలపై ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం నడుచుకోవాలని క్రిస్టినా చోంగ్తూ కోరారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు పోడు భూముల విషయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని, వారికి నచ్చజెప్పి జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం వోఎస్డీ ప్రియాంకవర్గీస్ సూచించారు.