Sridhar Babu | హైదరాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి హిట్లర్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి రాష్ట్ర మంత్రులు అష్టకష్టాలు పడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలను అటు సమర్థించలేక, ఇటు సర్ది చెప్పలేక వారికి తలప్రాణం తోకలోకి వస్తున్నది. మంచి ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేశారని చెప్పే క్రమంలో.. దాని గొప్పతనాన్ని వివరించే ప్రయత్నంలో సీఎం రేవంత్ హిట్లర్ పదం తెరపైకొచ్చిందని చెప్పేందుకు వారు విఫలయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డిని వెనుకేసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నానా తంటాలు పడ్డారు. హిట్లర్ తనకు స్ఫూర్తి అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్బాబు సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
హిట్లర్పై వ్యాఖ్యలను సీఎం దురుద్దేశంతో అనలేదని, ఒక లక్ష్యాన్ని చెప్పేందుకే ఆ పదాన్ని ఉపయోగించారని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. పరిపాలన లోతును, పాలనలో క్రమశిక్షణను, ఒక సంకల్పాన్ని, ఒక లక్ష్యాన్ని చెప్పేందుకే సీఎం హిట్లర్ అనే పదాన్ని వినియోగించారని తెలిపారు. అసలు సీఎం హిట్లర్ అనే పదం ఉపయోగించడం వెనుక ఆయన ఆలోచనను, తత్వాన్ని ఎవరూ అర్థం చేసుకోవడంలేదని చెప్పారు. హైడ్రా చట్టం ప్రకారమే పనిచేస్తున్నదని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. హైడ్రా ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తున్నదని, కబ్జాదారుల నుంచి చెరువుల్లో ఉన్న, ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.
హైడ్రా చర్యలపై ప్రజలు సంతోషిస్తున్నారని, మేధావులు, ప్రతి పౌరుడూ స్వాగతిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే క్రూరత్వం, హింసాత్మక ఫాసిజం ఎన్నడూ లేవని, వాటిని సహించేదిలేదని, సమర్థించేదీ లేదని స్పష్టంచేశారు. తెలంగాణలో ఎక్కడైనా భూముల ధరలు తగ్గాయా? అంటూ ప్రశ్నించారు. రైతులందరికీ రైతుభరోసా ఇస్తున్నట్టు చెప్పారు. తమ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలులో ఒక్క గింజ తరుగు తీయకుండా రైతులకు మేలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగడం లేదని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నామని తెలిపారు.