చెన్నై, ఫిబ్రవరి 22: తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే విజయ దుందుభి మోగించింది. చెన్నై కార్పొరేషన్లో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు విపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా పిలిచే పశ్చిమ తమిళనాడులోనూ జోరు కొనసాగించింది. రాష్ట్రంలోని 21 కార్పొరేషన్లలో మొత్తం 1,374 వార్డులకు గానూ 946 స్థానాల్లో డీఎంకే జయభేరి మోగించింది. 164 చోట్ల అన్నాడీఎంకే గెలిచింది. 138 పురపాలికల్లోని 3,843 సీట్లకు గానూ డీఎంకే 2,360 గెలుచుకోగా, అన్నాడీఎంకే 638 స్థానాలకు పరిమితమైంది. 490 పట్టణ పంచాయతీల్లో 7,621 సీట్లకు గానూ 4,388 చోట్ల డీఎంకే, 1,206 చోట్ల అన్నాడీఎంకే గెలుపొందాయి. ఫిబ్రవరి 19న జరిగిన ఈ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పూర్తి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నది.
కోయంబత్తూర్లో పాగా
చెన్నైలోని మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 200 వార్డులకు గానూ డీఎంకే 153 చోట్ల, అన్నాడీఎంకే 15 చోట్ల గెలుపొందాయి. కాంగ్రెస్ 13, సీపీఎం, వీసీకే నాలుగు సీట్ల చొప్పున, బీజేపీ ఒక్క స్థానంలో గెలిచింది. 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటికీ, పశ్చిమప్రాంతంలోని కోయంబత్తూర్ జిల్లాలో మొత్తం 10 సీట్లనూ అన్నాడీఎంకే కైవసం చేసుకొన్నది. అయితే ఇప్పుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడి ప్రాంతంలోనూ డీఎంకే హవా కొనసాగింది. మొత్తం స్థానాల్లో 75 శాతం సీట్లు స్టాలిన్ పార్టీ చేజిక్కించుకొన్నట్టు సమాచారం. దీంతో కోయంబత్తూర్ మేయర్ పీఠాన్ని తొలిసారిగా డీఎంకే కైవసం చేసుకోనున్నది.