హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల, హంద్రీనీవా ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1.73 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 1.39 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తుండగా, విద్యుదుత్పత్తి ద్వారా 66,198 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా 2.05 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.
కాగా, శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.80 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టులో 215.80 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ఇప్పుడు 214.36 టీఎంసీల నీరు ఉన్నది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.