Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సోమవారం ఆది దంపతుల దర్శనాల కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధులు సందడిగా మారాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామి అమ్మవార్లకు జరిపే నిత్య ఆర్జిత సేవలు యధాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. శీఘ్ర, అతిశీఘ్ర, విరామ దర్శనాలకు గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలంకరణసేవ నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేబు చేసి వేద పండితులు మహాసంకల్పం పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన, పల్లకిసేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ దక్షిణమాడవీధిలోని కళారాదన వేదికపై మహబూబ్నగర్కి చెందిన ఉషాబేబీ కూచిపూడి నృత్యం భక్తులను ఆలరింప జేసింది.