గీలాంగ్: టీ20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ శ్రీలంక పోటీలోకి వచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ యూఏఈపై 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యఛేదనలో యూఏఈ 17.1 ఓవర్లలో 73 పరుగులకు కుప్పకూలింది. హసరంగ(3/8), చమీర (3/15), తీక్షణ(2/15) ధాటికి అఫ్జల్ఖాన్ (19), సిద్ధిఖి(18) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలియన్కు వెళ్లడంతో ఈ టీ20 ప్రపంచకప్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా యూఏఈ చెత్త రికార్డు మూటగట్టుకుంది.
అంతకుముందు నిస్సనక (74), ధనంజయ డిసిల్వా(33)రాణించడంతో లంక నిర్ణీత ఓవర్లలో 152/8 స్కోరు చేసింది. ఆది నుంచి తనదైన దూకుడు కనబరిచిన నిస్సనక లంకకు పోరాడే స్కోరు కట్టబెట్టాడు. యూఏఈ యువ బౌలర్ కార్తీక్ మేయప్పన్(3/19) హ్యాట్రిక్తో అదరగొట్టాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వరుస బంతుల్లో రాజపక్స(5), చరిత అసలంక(0), దసున్ శనక(0)ను ఔట్ చేసి యూఏఈ తరఫున హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్గా మేయప్పన్ రికార్డుల్లోకెక్కాడు. నిస్సనకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
5 టీ20 ప్రపంచకప్లో హ్యాట్రిక్ సాధించిన ఐదో బౌలర్గా కార్తీక్ మేయప్పన్ నిలిచాడు. ఇంతకుముందు బ్రెట్లీ, కాంఫర్, హసరంగ, రబాడ ఉన్నారు.