శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. ఆ తర్వాత, ఎన్నో మలుపులు. అంతలోనే యాదరుషి పాత్ర ప్రవేశిస్తుంది. అతడి ఆధ్యాత్మిక అన్వేషణ మొదలవుతుంది.
‘శ్రీలక్ష్మీ నరసింహుడే నాకు మార్గం చూపాలి’.. అనుకొన్నాడు యాదరుషి. ఆయన కనబడాలి అంటే.. చూడటానికి కేవలం కనులుంటే చాలదు. హృదయం ఉండాలి. గుండె నిండా భక్తి ఉండాలి. భక్తి అంటే.. నమ్మకం!నరసింహుడు ఉన్నాడు. అన్నీ చూస్తున్నాడు. అంతా తానై నడిపిస్తున్నాడు. పూర్తిగా నమ్మితేనే.. మనసంతా విశ్వాసాన్ని ప్రోది చేసుకొంటేనే.. స్వామి కనిపిస్తాడు. కరుణిస్తాడు. కానీ..
ఆ అనుగ్రహ సందర్భం వచ్చేవరకూ వేచి ఉండాలి. దీక్షగా పరీక్షకు తట్టుకోవాలి. నిరీక్షణ ఫలించేవరకూ నిద్రాహారాలు మాని, ఆహార పానీయాలను వదిలి.. పరమ నిష్ఠతో నియమాల మాల ధరించాలి.
అంత సులభం కాదు. స్వామివారి దర్శనం!అయితే, మనసుంటే, సంకల్పముంటే స్వామివారి దర్శనం దుర్లభం కూడా కాదు.నమో నారసింహాయ!
తపో ముద్రలో కూర్చున్నాడు యాదరుషి.
అప్పుడు మొదలైంది.. ప్రళయ భీకర బీభత్సం!
ఎందుకిలా జరుగుతున్నది?
ఎప్పుడు శుభ సంకల్పాన్ని ఆచరణలో పెడదామనుకున్నా..
ఎందుకిలా అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఉత్పాతాలు కలుగుతున్నాయి.
యాదరుషికి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
“నాయన గారూ! ప్రకృతి చల్లని తల్లి అంటారు కదా! మరి తపస్సును భగ్నం చేసే ప్రచండ వాయువులు, ప్రభంజనాలు ఎందుకు ఏర్పడతాయి. వ్యతిరేక పవనాలు ఎందుకు వీస్తాయి? దీని మర్మమేమిటి?” అని అడిగాడు తను.. తండ్రిని!
దానికి ఆయనన్నాడు..
“నాయనా.. యాదరుషీ! ప్రకృతి వెంబడే వికృతి కూడా ఉంటుంది. పవిత్రతను సహించలేని అపవిత్రత ఉంటుంది. శిష్టత్వాన్ని వ్యతిరేకించే దుష్టత్వం ఉంటుంది. మంచి అనేదాన్ని పెంచాలి. వ్యాపించి ఉన్న చెడును, చెడు భావాలను ఎప్పటికప్పుడు అణచివేసే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రకృతి ఎప్పుడూ మంచిదే.. దానికి కనబడకుండా దాక్కొని మంచిని నాశనం చేయాలనే వంచనా శక్తులు ఎప్పుడూ పొంచి చూస్తుంటాయి. అంతదాకా ఎందుకు? రాముడిని యాగ రక్షణ కోసం విశ్వామిత్రుడు ఎందుకు తీసుకెళ్లాడు? దుష్టశక్తుల విజృంభణ నుండి మంచి వారిని కాపాడటానికి. సజ్జనులు సంకల్పించిన యాగాన్ని సంపూర్ణం అయ్యేట్టు చూడటానికి! రాక్షసుల వికృత చర్యలను అణచి వేయడానికి రాముడే కావలసి వచ్చాడు”..
అది వింటూనే ఉద్విగ్నభరితుడయ్యాడు యాదరుషి.
“అవును కదా మరి, లోకాలను తన పాపాలతో మాడ్చి మసి చేస్తున్న రాక్షసరాజు హిరణ్య కశిపుణ్ని చంపడానికే కదా, దేవదేవుడు నరసింహుడి అవతారం ధరించి స్తంభాన్ని పగలగొట్టుకొని బయటికి ఉరికి వచ్చాడు. రాక్షస సంహారం చేశాడు. లోక వ్యతిరేక శక్తులను ఎదుర్కొని అణచి వేయడం దేవుడికి సాధ్యం అవుతుంది కానీ, మనవంటి మనుషులకు ఎలా వీలవుతుంది? అట్టి శక్తులు తలెత్తితే, విశృంఖల విహారం చేస్తే.. తలవంచి తప్పుకోవడమేనా, సంకల్పాన్ని వదిలి వేయడమేనా?” అడిగాడు యాదరుషి.
“ఆ అవసరం లేదు కుమారా! మన సత్సంకల్పానికి దుష్టశక్తులు అడ్డుపడితే, మన దీక్షను భగ్నం చేయాలని చూస్తే.. మనం వెనకంజ వేయనక్కర్లేదు. గాలివానకు కొన్ని చెట్లు కూలిపోతాయి. కానీ, వేర్లు బలంగా ఉండి తట్టుకొనే శక్తి ఉన్న చెట్టును పెనుగాలి కూడా పెకలించి వేయలేదు. ఊపీఊపీ అక్కణ్నుంచి వెళ్లిపోతుంది. అంటే, దానర్థం.. మనం వ్యతిరేకతను తట్టుకోవాలి. దుష్టశక్తుల దుశ్చర్యలను సహించి, ఎదురించాలి. తపశ్శక్తిని సమీకృతం చేసుకోవాలి. తమ ప్రయత్నాలు నిష్ఫలమైతే, ఆ చెడు శక్తులే తోక ముడుస్తాయి. ఏది ఏమైనా మనం అనుకొన్నది సాధించాలంటే.. అనుకోని అవాంతరాలను ఎదుర్కోవాలి. ఒక్కటే గుర్తుంచుకో.. మన లక్ష్యం బలంగా ఉంటే, భూమీ ఆకాశం ఒక్కటైనా, సప్త సముద్రాలు ఉప్పొంగినా.. మనకేమీ కాదు. మన సంకల్పంలోని సార్వజనీనత్వమే దృఢత్వమై.. రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది”.. ఆ మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి.
నువ్వు మామూలుగా ఉంటే ఎవరూ నీ జోలికి రారు.
నువ్వు నలుగురికీ మేలు చేసే పని చేయాలనుకొంటే.. పదిమంది శత్రువులవుతారు.
విజయం సాధించావా.. అందరూ నిన్ను అందలం ఎక్కిస్తారు.
అపజయమే పొందావా.. అథఃపాతాళానికి తొక్కడానికి ప్రయత్నిస్తారు.
అన్నిసార్లు విజయాలే వరించవు. అపజయాలూ వస్తాయి. మనసును కుంగదీసే ప్రయత్నం చేస్తాయి.
అపజయ సమయంలో నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఇతరుల సానుభూతి నుండి.. అవహేళనల నుండి.. అపహాస్యాల నుండి!
మేఘాలు కప్పేసి సూర్యుడు కనబడకుండా ఉంటే.. ఆ క్షణంలో చూసి అసలు సూర్యుడే లేడని అనుకొంటాయి వైరిశక్తులు. కానీ, మబ్బులు తొలగిపోయిన మరుక్షణం సూర్యుడు మళ్లీ మహోజ్వలంగా వెలుగుతాడని అవి ఊహించవు. అందుకే.. ఉత్తములు గెలుపునూ, ఓటమినీ సమభావంతో స్వీకరిస్తారు. వారి మనస్థితిలో ఏమీ మార్పురాదు.
వారే స్థితప్రజ్ఞులు..
యాదరుషీ అంతే!
స్వామి దర్శనం కోసం తపస్సు చేద్దామనుకొంటే.. ఎన్నోసార్లు, ఎన్నెన్నో అడ్డంకులు! ఇక ఎప్పటికీ ఇది సాధ్యం కాదేమో అనే వ్యతిరేక సందర్భాలు. వాటిని అధిగమిస్తేనే.. అనుకొన్నది దొరుకుతుంది.
కనులు మూసుకొని తపస్సుకు ఉపక్రమించాడో లేదో..
గాలి బీభత్సం అంతకంతకూ ఎక్కువవుతోంది.
అకాల వర్షం అతి భీకరంగా కురుస్తోంది.
ఉరుములు, మెరుపులు.. అటూఇటూ చిగురుటాకుల్లా ఊగిపోతున్న వృక్షాలు.
ముసురుగా మొదలై ఉసురు తీసేంతగా పెరిగిపోయిన వర్షం.. చీకటిని వ్యాపింపజేస్తోంది.
చూస్తుండగానే మధ్యాహ్న కాంతి ఆవిరై, చిమ్మ చీకటి ఆవరించింది.
ఇది సహజంగా లేదు.
అసహజంగా, అనూహ్యంగా ఉంది.
ఇది ప్రకృతి కాదు.. వికృతి!
యాదరుషి చుట్టూ చూశాడు.
మామూలు మానవ నేత్రానికి కనిపించని వికృతమైన రకరకాల ఆకారాలు చీకటిలో నైరూప్యంగా మెరుస్తున్నాయి.
కళ్లు ఎర్రగా మెరుస్తూ.. కనుగుడ్లు అగ్ని గోళాల్లా అటూఇటూ కదులుతూ..
ముద్దలు ముద్దలుగా ఉన్న ఆకారాలు ఒకటొకటి కలిసిపోయి ఒక రాక్షసాకారాన్ని సంతరించుకొన్నాయి.
“ఎవరు నువ్వు?” అడిగాడా రాక్షసుడు.
“తపస్విని!” భయం లేకుండా చెప్పాడు యాదరుషి.
“కాదు.. నువ్వు నాకు ఆహారానివి. నిన్ను అమాంతం మింగేస్తాను.. ఆకలిగొన్న నా పేగుల మంటల్లో నువ్వు గిరగిరా తిరిగి జీర్ణమైపోతావ్..” వికటాట్టహాసం చేస్తూ అన్నాడు రాక్షసుడు.
“నేను తపస్విని.. నరసింహుడి దర్శనం కోసం తపస్సు చేద్దామనుకొంటున్నాను. నువ్వు నన్నేం చేయలేవు. నన్ను ఎవరని అడిగావ్.. అసలు నువ్వెవరు?”.. తీక్షణంగా చూస్తూ అడిగాడు యాదరుషి.
“నేనా?” అని భయంకరంగా నవ్వి..
“నాకు చాలా పేర్లున్నాయ్. మీ మనుషుల భాషలో.. ఈర్ష్య, అసూయ, వివక్ష, అహంకారం, దరిద్రం, దౌర్భాగ్యం, దుర్మార్గం, అష్టకష్టాలు.. చాలా పేర్లున్నాయ్. నేను తలుచుకొంటే ఈ రూపాల్లోనే మనుషుల మధ్య చిచ్చు పెడతాను. ఒకడి రక్తాన్ని ఇంకొకడు కళ్ల చూసేలా చేస్తాను. నేను రక్త పిపాసిని. పచ్చగా ఉన్న చెట్లను నిలువునా కాల్చేస్తాను. పచ్చగా ఉన్న కుటుంబాలను నలిపేస్తాను. కలియుగం.. నా యుగం. నన్నెవరూ ఏమీ చేయలేరు..” అని చెప్పాడు రాక్షసుడు.
ఆ రాక్షసుడి నవ్వు ఆ కొండ గుహల్లో.. ఆ వర్ష ధారల్లో సైతం భయం పుట్టించేలాగా ప్రతిధ్వనిస్తోంది.
“నేను పుణ్యకార్యాలకు అడ్డంకిని. పాపపు పనులకు ప్రేరేపకుడిని. నాకు ఎదురు లేదు. నాకు అడ్డు లేదు. నాకు అదుపు లేదు. నీలాంటి మనుషులను నంజుకు తినడమే.. నా పని!”.
అప్పుడు చూశాడు యాదరుషి అతడిని.
వాడు.. మహా రాక్షసుడు.
కాకపోతే వాడికి అడ్డూ అదుపూ ఉండాలంటే.. స్వామి రావాలి.
నరసింహుడు గుహ నుండి, శిలారూపం నుండి వెలుపలికి రావాలి.
ఎప్పుడొస్తాడు?
ఎప్పుడు తనకు దర్శనం ఇస్తాడు?
పాపాలను తొలగించేవాడు, పిశాచ గ్రహ పీడను నిర్మూలించేవాడు, మానవులకు ముక్తిని ప్రసాదించేవాడు.. రావాలి. దిగి రావాలి.
“నారసింహా.. నా దైవమా.. దర్శనమీయవయా!” ఆర్తిగా ప్రార్థించాడు యాదరుషి.
‘నారసింహా.. నారసింహా..’ అన్న శబ్దాలు వినబడినప్పుడల్లా, ఆ రాక్షసుడు ఒళ్లంతా కదిలిపోయేలాగా వణికి పోతున్నాడు. అయినా లేని ధైర్యం కూడదీసుకొంటూ అడిగాడు.
“వస్తాడా.. నీ నరసింహుడు? ఏడీ ఎక్కడా కనబడడే! గుహలో ఉన్నవాడు, బయటికి ఎలా వస్తాడు? అయినా, నువ్వు పిలిస్తే వస్తాడా? అసలు మేమెవరమో నీకు తెలుసా? నేను ఒక్కణ్ని కాదు. అనేకం. రోగాన్ని, వియోగాన్నీ, వినాశనాన్నీ, విధ్వంసాన్నీ కలిగించేది నేనే.. మిమ్మల్ని తీసుకుపోయేది నేనే!”..
ఆ రాక్షసుడి మాటలకు భయపడలేదు యాదరుషి.
“ఓహో.. నువ్వు దైవ వ్యతిరేకివా? అయితే విను. నువ్వు రోగమైతే.. నయం చేసే మందు నా స్వామి. నువ్వు వియోగాన్ని కల్పించడానికి ముందే విడదీయలేనంతగా అనురాగంతో మనుషులను మనసులను కలిపి ఉంచేది నా దేవుడే! నీది వక్రదృష్టి.. నా స్వామిది సమస్త సృష్టి! స్వామి కొనగోటితో గీరితే తలలు తెగిపడే రాక్షస సంతతి నీది. నిత్యమూ, నిరతమూ.. నిలిచి ఉండే శాశ్వత మూర్తి ఆయన. ఆయన అనుగ్రహం ఉంటే.. ఆయన అండ ఉంటే.. కొండమీద ఆయన కొలువై ఉంటే.. నువ్వు ఎవర్నీ ఏమీ చేయలేవు!”.. ఆ మాటలకు పడీపడీ నవ్వాడు బ్రహ్మ రాక్షసుడు.
“అల్ప జ్ఞానీ! నీ స్వామి ఎప్పుడొస్తాడో తెలియదు. అసలు వస్తాడో రాడో కూడా నీకు తెలియదు. అతగాడు వచ్చేదెపుడు? నేను చచ్చేదెపుడు? ఈలోపున కీటకాన్ని తొండ చప్పున చప్పరించినట్టు.. నిన్ను చప్పరించి వేస్తాను. ఏ దేవుడు అడ్డొస్తాడో చూస్తాను..” అరుస్తూ ముందుకొచ్చాడు బ్రహ్మ రాక్షసుడు.
యాదరుషి.. అతడినే తీక్షణంగా చూస్తూ అన్నాడు..
“ఓం.. నమో నారసింహా!”
“ఓహో.. నువ్వు దైవ వ్యతిరేకివా? అయితే విను. నువ్వు రోగమైతే.. నయం చేసే మందు నా స్వామి. నువ్వు వియోగాన్ని కల్పించడానికి ముందే విడదీయలేనంతగా అనురాగంతో మనుషులను మనసులను కలిపి ఉంచేది నా దేవుడే! నీది వక్రదృష్టి.. నా స్వామిది సమస్త సృష్టి! స్వామి కొనగోటితో గీరితే తలలు తెగిపడే రాక్షస సంతతి నీది. నిత్యమూ, నిరతమూ.. నిలిచి ఉండే శాశ్వత మూర్తి ఆయన. ఆయన అనుగ్రహం ఉంటే.. ఆయన అండ ఉంటే.. కొండమీద ఆయన కొలువై ఉంటే.. నువ్వు ఎవర్నీ ఏమీ చేయలేవు!”
మన సత్సంకల్పానికి దుష్టశక్తులు అడ్డుపడితే, మన దీక్షను భగ్నం చేయాలని చూస్తే.. మనం వెనకంజ వేయనక్కర్లేదు. గాలివానకు కొన్ని చెట్లు కూలిపోతాయి. కానీ, వేర్లు బలంగా ఉండి తట్టుకొనే శక్తి ఉన్న చెట్టును పెనుగాలి కూడా పెకలించి వేయలేదు. ఊపీఊపీ అక్కణ్నుంచి వెళ్లిపోతుంది. అంటే, దానర్థం.. మనం వ్యతిరేకతను తట్టుకోవాలి. దుష్టశక్తుల దుశ్చర్యలను సహించి, ఎదురించాలి. తపశ్శక్తిని సమీకృతం చేసుకోవాలి. తమ ప్రయత్నాలు నిష్ఫలమైతే, ఆ చెడు శక్తులే తోక ముడుస్తాయి. ఏది ఏమైనా మనం అనుకొన్నది సాధించాలంటే.. అనుకోని అవాంతరాలను ఎదుర్కోవాలి.