సిటీబ్యూరో/కంటోన్మెంట్, జూన్ 1(నమస్తే తెలంగాణ) : కంటోన్మెంట్ నియోజకవర్గ విస్తృత సమావేశం విజయవంతం కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వణుకు పుట్టిందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఎద్దేవా చేశారు. గులాబీ శ్రేణుల తిరుగులేని జనసందోహాన్ని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అవకాశవాద రాజకీయంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలా రాజకీయ లాభం కోసం మూడు పార్టీలు మారిన నీకు అసలు సిద్ధాంతం ఉందా? అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే జెండాలు మార్చే నీలాంటి వ్యక్తి, స్వరాష్ట్ర సాధన కోసం ఉమ్మడి రాష్ట్రంలో లాఠీ దెబ్బలు తిన్న తమ బూత్ స్థాయి కార్యకర్తలను డబ్బులకు అమ్ముడుపోయే వాళ్లంటూ అవమానిస్తావా? అని సవాల్ విరిచారు. సమావేశానికి వచ్చిన వారంతా ఒరిజనల్ ఉద్యమకారులని, దమ్ముంటే ఎమ్మెల్యే ముందు కూర్చోబెట్టడానికి సిద్ధమని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యవర్గ సమావేశం, ఎస్ఐఆర్ అవగాహన, బూత్ స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీగణేశ్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యేను నిలదీయాలన్నారు. తులం బంగారం, మహిళలకు 2500 భృతి, ఆరువేల ఇందిరమ్మ ఇండ్లను ఇంకెప్పుడూ ఇస్తారంటూ ప్రశ్నించారు. కనీసం నియోజకవర్గంలో కొత్తగా ఒక ఆరు ఇండ్లు అయినా ఇచ్చారా? అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో అల్వాల్లో నిర్మించిన టిమ్స్ను రెండున్నరేళ్లు గడిచిన ఎందుకు ప్రారంభించడం లేదన్నారు. నీటి ఇబ్బందితో ప్రజలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచే దమ్ముందా..?
గత ఎన్నికల్లో ఓటర్లకు రూ. 2వేలు పంచి అడ్డదారిలో గెలిచావని, ఆ డబ్బులే లేకపోతే డిపాజిట్ కూడా ఎమ్మెల్యేకు దక్కేది కాదన్నారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో రూపాయి పంచకుండా గెలవాలని సవాల్ విసిరారు. సొంత పార్టీ కోసం పనిచేసిన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులకు కనీసం ఒక్క పదవైనా ఇప్పించావా? అన్నారు. అదే బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు, పార్టీ నాయకులకు కంటికి రెప్పలా చూసుకుంటూ, పదవులు కట్టబెట్టారన్నారు.