ఆధ్యాత్మిక, పౌరాణిక,చారిత్రక ధారావాహిక 48
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. యాదర్షి తపస్సు, నారసింహావతార రహస్యం గురించి త్రిభువన మల్లుడికి వివరిస్తాడు విజ్ఞానేశ్వరుడు . అంతలోనే యుద్ధమేఘాలు. విష్ణువర్ధనుడిలో అంతర్మథనం మొదలైంది.
విష్ణువర్ధనుడు కలల్లో విహరిస్తున్నాడు.
ఏది కల?
ఏది వాస్తవం?
ఏది సంభవం?
ఏది అసంభవం??
అతనికి అవగతం కావడం లేదు. ఆశయం ఉన్నవాడు, దాన్ని నెరవేర్చుకోవడానికి విజ్ఞతతో వ్యవహరించి, ప్రణాళికలు, వ్యూహాలు రచించి విజయం సాధిస్తాడు. అపజయం ఎదురైనా విజయం దక్కేదాకా విశ్రమించడు. నిరాశకు లోనుకాడు.
విష్ణువర్ధనుడు అన్ని కళల్లో ప్రవేశం ఉన్నవాడు. భగవంతుడిపై భక్తి కలిగిన వాడు. మంచీచెడు తెలిసినవాడు. నియమ
బద్ధంగా రాజ్యపాలన చేయాలనే ఆశయం కూడా ఉన్నవాడు. ఇదంతా ఇప్పటి సంగతి కాదు. ఒకనాటి కథ.
విష్ణువర్ధనుడి భార్య శాంతలాదేవి ఆలోచిస్తున్నది ఇదే.
ఆశయం మంచిదైతే, దాన్ని పెంచి పోషించవచ్చు.
అది దురాక్రమణకు, దురాశకూ లోనైతే, ఆశయం కాస్తా పేరాశగా మారితే, సన్మార్గుడు దుర్మార్గుడు అవుతాడు. మంచివాడు కాస్తా ముంచేవాడు అవుతాడు.
శాంతలాదేవికి పరిస్థితి అర్థమవుతున్నది. తన భర్త విజయం దిశగా వెళ్తున్నాడు. అది రాజ్య విస్తరణ అని తను అనుకుంటున్నాడు. కానీ, మరొకరి హక్కుల తిరస్కరణ అని తెలుసుకోవడం లేదు. మరొకరు మన మీదికి దండెత్తి వస్తే, ఆ యుద్ధం అనివార్యం. దేశ రక్షణకు సంబంధించిన పవిత్ర కర్తవ్యం!
కానీ, మనమే మరొకరి రాజ్యాన్ని దురాక్రమణ చేయాలనుకుంటే ఆ యుద్ధం, నిషిద్ధం! కూడని పనిచేసినట్టు. ఇప్పుడు గెలిస్తే గెలవొచ్చు. ఒకటీ అరా దుర్గాలను స్వాధీనం చేసుకోవచ్చు.
కానీ, దైవశక్తి అనేది ఒకటుంటుంది. నీతినియమాలు, పరిమితులు, అతిక్రమణల ఆధారంగానే విధి అనేది తన విధి నిర్వహణ చేస్తుంది.
ఎందుకో మహారాణి శాంతలాదేవికి భర్తను ఈ యుద్ధం నుంచి ఆపాలని, భువనగిరి సామ్రాజ్యాన్ని ఆక్రమించకుండా చూడాలని బలంగా అనిపిస్తున్నది.
ఈ భావన ఎందుకొస్తున్నదో తనకే అర్థం కావడం లేదు. భువనగిరితో తనకెలాంటి బంధుత్వమూ లేదు. తాను తన భర్త గురించీ, హొయసల సామ్రాజ్యం గురించీ ఆలోచించాలి కానీ, ఇదేమిటి? తన ఆలోచనలు తన భర్త తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటున్నాయేమిటి?
..అంటే న్యాయంగా ఆలోచిస్తే, ధర్మం అటువైపే ఉన్నది.
భువనగిరి సామ్రాజ్యంలో ఎగురుతున్న ధర్మపతాక నేలకు దిగకూడదు.
బహుశా! అందుకేనేమో, తనకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి.
ఒక్క క్షణం కనులు మూసుకొని ఆలోచించింది.
ఎవరు, తన భర్త విష్ణువర్ధన మహారాజుకు నచ్చచెప్పగలరు?
ఎవరు చెప్తే, ఆయన తన మనసు మార్చుకుంటారు?
ఆమెకు ఒకటి అనిపించింది.
ఈ కాలంలో భార్య సలహా చెప్తే ఏ భర్త దాన్ని పాటిస్తాడు?
విష్ణువర్ధనుడు తన భర్తే కాదు, రాజ్యానికి రాజు. దురాక్రమణ దురహంకారంతో ఉన్నాడు.
“నువ్వు అనుకుంటున్నది నిజమేనమ్మా! విష్ణువర్ధన మహారాజు యుద్ధం అనేది శక్తిపైన ఆధారపడి ఉంది అనుకుంటున్నాడు. నువ్వేమో యుద్ధం ధర్మబద్ధంగా ఉండాలనుకుంటున్నావు. ఈ సమయంలో విష్ణువర్ధనుని మనసు మార్చటం, మార్గాన్ని మళ్లించడం సాధ్యపడే విషయం కాదు.”రాజగురువు మాటలు విని, నిరాశకు లోనయింది మహారాణి.“మరొక దారి ఏదీ లేదంటారా? మీవంటి మహాత్ములు చెప్తే, వారు కాదంటారంటారా?”“నేనేమీ మహాత్ముణ్ని కాదమ్మా. అయితే నాకొక మార్గం స్ఫురిస్తున్నది” సాలోచనగా అన్నారు.
తనను ప్రేమించి పెళ్లాడి, అర్ధాంగిగా సంపూర్ణ గౌరవం కల్పించిన నా ప్రియతముడు విష్ణువర్ధనుడు, ఎందుకిలా మారిపోయాడు?
ఎందుకో ఆమెకు అనిపించింది.
అందరూ ఎంతగానో గౌరవించే రాజ గురువుల వారిని కలిసి, తన ఆలోచనలు ఆయనకు చెప్తే, ఏదైనా ప్రయోజనం ఉంటుందేమోనని!
వెంటనే, రాజగురువుకు వర్తమానం పంపించింది. వారిని అత్యవసరంగా కలిసి, ఆశీస్సులు తీసుకోవాలని అనుకుంటున్నానని!
అదే సమయానికి ఎవరో పిలిచినట్టుగా గురుదేవులే వేంచేస్తున్నారని సమాచారం వచ్చింది.
ఇదేదో శుభశకునంగా అనిపించింది.
ఫలపుష్పాలతో ఎదురేగి, స్వాగతం పలికింది. రాజగురువులు సముచితాసనంలో ఆసీనులయ్యాక, వారి పాదాలకు నమస్కరించింది.
“దీర్ఘసుమంగళీభవ!”
సాక్షాత్తూ దేవతలే ఆశీఃవచనం పలికారా, అనిపించింది ఆయన ఆశీర్వచనం తీసుకుంటుంటే!
“గురుదేవా! మీ ఆశ్రమానికి వచ్చి తమరి ఆశీస్సులు పొందాలని అనుకున్నాను. కానీ, నా మనసులో మాట తెలిసినట్టుగా మీరే రావడం, మాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నది”
వినమ్రంగా పలికింది.
ఆయన చిరునవ్వుతో తల పంకించారు.
“అమ్మా! మీరు ఏమి ఆలోచిస్తున్నారో, దేని గురించి ఆందోళన చెందుతున్నారో చెప్పండి. మాకు స్ఫురించిన విషయం మేము చెబుతాం” అన్నారాయన.
శాంతలాదేవి తన సందేహాలు ఆయనకు వివరించింది.
అంతా విన్నారు.
“నువ్వు అనుకుంటున్నది నిజమేనమ్మా! విష్ణువర్ధన మహారాజు యుద్ధం అనేది శక్తిపైన ఆధారపడి ఉంది అనుకుంటున్నాడు. నువ్వేమో యుద్ధం ధర్మబద్ధంగా ఉండాలనుకుంటున్నావు. ఈ సమయంలో విష్ణువర్ధనుని మనసు మార్చటం, మార్గాన్ని మళ్లించడం సాధ్యపడే విషయం కాదు.”
రాజగురువు మాటలు విని, నిరాశకు లోనయింది మహారాణి.
“మరొక దారి ఏదీ లేదంటారా? మీవంటి మహాత్ములు చెప్తే, వారు కాదంటారంటారా?”
“నేనేమీ మహాత్ముణ్ని కాదమ్మా. అయితే నాకొక మార్గం స్ఫురిస్తున్నది” సాలోచనగా అన్నారు.
చీకట్లో ఒక చిన్న వెలుగు రేఖ కనిపించింది.
“చెప్పండి గురుదేవా?” అన్నది ఆశగా.
“మనందరికీ మార్గం చూపేవాడు, నిజమైన మహాత్ముడు, అవతార పురుషుడు ఒకరున్నారు. వారు ఒక చల్లని చూపు చూస్తే సమస్య పరిష్కారమవుతుంది.”
“ఎవరు గురుదేవా, వారు?”
“రామానుజాచార్యుల వారు…”
ఆపేరు అంటూనే వారు కూర్చున్న ఆసనంపై నుండి లేచి, రామానుజుల వారే ఎదురుగా ప్రత్యక్షం అయినట్లుగా వినమ్రంగా చేతులు జోడించి నిలబడ్డారు.
శాంతలాదేవికి అర్థమైంది. కానీ ఇది సాధ్యమయ్యే సంగతి కాదు. ఎందుకంటే… ఆధ్యాత్మిక విషయాల్లో దిశా నిర్దేశనం చేసే ఆచార్యులు వారు. ఇటువంటి అలౌకిక వ్యవహారాల్లో సూచనలు చేస్తారా? ఇది జరగని పని!
“గురుదేవా! రామానుజుల వారు పూర్తిగా ఆధ్యాత్మిక విషయాల్లో లీనమై ఉన్నారు. వారి దర్శనం కూడా కష్టం అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో…”
“అమ్మా, మహారాణీ! చూద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆచార్యుల వారు ఎక్కడున్నారో తెలుసుకొని, వారి దర్శనం చేసుకొని ప్రయత్నం చేస్తాను… అంతవరకు మనం సహనంతో ఉండవలసిందే…”
రాజగురువు మాటలకు మౌనంగా తల ఊపి, మరొకసారి వారికి అభివాదం చేసి నిష్క్రమించింది.
మహారాణి వెళ్లిపోయాక, ఒక శిష్యుడు వినయంగా అడిగాడు.
“స్వామీ, ఈ రామానుజుల వారు ఎక్కడినుంచి వచ్చారు? వారి గురించి వివరించండి”
“తప్పకుండా” అన్నారు రాజగురువులు.