– ఎండిన పొలం
– రూ. 5 లక్షల ఆస్తి నష్టం
– దాచారంలో మహిళా రైతు ఆవేదన
నేరేడుచర్ల, మార్చి 20 : నేరేడుచర్ల మండలం దాచారం గ్రామంలో 5.14 ఎకరాల భూమిలోని వరి పంటపై గడ్డి మందు కొట్టడంతో ఎండిపోయిందని, తద్వారా తనకు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని దాచారం గ్రామానికి చెందిన మహిళా రైతు పేర్వాల శ్రీదేవి తెలిపారు. శ్రీదేవి శుక్రవారం విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2008లో తాను పొలం కొనుగోలు చేశానని అప్పటి నుంచి తాను భూమి సాగు చేసుకుంటుండగా, 2018లో ధరణిలో తనకు కొత్త పాస్ పుస్తకం రాలేదని తెలిపారు. తనకు తెలియకుండా పట్టా మార్పు జరగడంతో అనుమానం వచ్చి కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిపింది. తనకు అనుకూలంగా 2025లో తీర్పు రావడంతో వరి సాగు చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇదే తీర్పు ఆధారంగా తనకు కొత్త పాస్ పుస్తకం వచ్చిందని తెలిపింది.
తనకు వ్యతిరేకంగా ఉన్న కోట్ల సునిత, కోట్ల వెంకటరెడ్డితో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 16న తన వరి పొలానికి గడ్డి మందు కొట్టారని తెలిపింది. గత నాలుగు రోజుల నుండి పొలం పూర్తిగా ఎండిపోవడంతో అనుమానం వచ్చి వెంటనే అదే రోజున పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. గురువారం రాత్రి పొలంలోని స్టార్టర్ ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్లు తెలిపింది. ఈ సంఘటనపై తగు విచారణ చేసి తనకు న్యాయం చేయాలని నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది
ఈ విషయంపై స్థానిక ఎస్ఐ రవీందర్ ను వివరణ కోరగా శ్రీదేవి తన పొలానికి గడ్డి మందు కొట్టారని ఫిర్యాదు చేసిందని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, ఈ విషయంపై స్థానిక తాసీల్దార్, వ్యవసాయాధికారులకు కూడా సమాచారం అందించినట్లు చెప్పారు. విచారణ చేసి బాధ్యులైన వారిని ఆరెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఐదు ఎకరాల వరి పంటపై గడ్డి మందు స్ప్రే