ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా(North Korea) నేత కిమ్ జాంగ్ ఉన్ 13 ఏళ్ల కుమార్తె జూ యే యుద్ధ ట్యాంక్ను నడిపింది. ఈ ఘటనకు చెందిన ఫోటోలను ప్రభుత్వం మీడియా రిలీజ్ చేసింది. జూ యే ఆర్మీ ట్యాంక్ను డ్రైవ్ చేస్తుండగా.. ఆమె పక్కనే కిమ్ జాంగ్ కూర్చున్నారు. ఆ ట్యాంకర్పై మరికొంత మంది సైనిక అధికారులు కూడా ఉన్నారు. ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ ఆ ఫోటోలను రిలీజ్ చేసింది. టీనేజ్ అమ్మాయి జూ యే గత కొన్నాళ్ల నుంచి కిమ్ పక్కనే తరుచూ కనిపిస్తూ ఉన్నది. అయితే బహుశా ఆ అమ్మాయిని భవిష్యత్తు దేశాధినేతగా కిమ్ తీర్చిదిద్దుతున్నారేమో అన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా రిలీజైన ఫోటోల్లో కిమ్ కుమార్తె డ్రైవర్ సీట్లు కూర్చున్నది. చాలా ఫోకస్ పెట్టి మరీ యుద్ధ ట్యాంక్ను నడిపింది. ఇటీవల ఫైరింగ్ రేంజ్లో రైఫిల్తో ఆ అమ్మాయి కనిపించిన విషయం తెలిసిందే. మరో చోట హ్యాండ్గన్తో షూటింగ్ చేస్తున్న పిక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఆ అమ్మాయికి చెందిన పేరు కానీ, వయసు కానీ అధికారికంగా ప్రభుత్వం వెల్లడించలేదు. ఉత్తర కొరియా సైనిక దళంలోకి కొత్త యుద్ధ ట్యాంక్లు వచ్చాయి. గురువారం ఆ ట్యాంక్లను కిమ్ పరిశీలించారు. డ్రోన్లు, యాంటీ ట్యాంక్ మిస్సైళ్లను ఆ ట్యాంక్తో పేల్చవచ్చు. బాలిస్టిక్, న్యూక్లియర్ వెపన్స్ను ఆధునీకరించేందుకు ఇటీవల కిమ్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త ట్యాంక్లను పరిశీలించారు.