హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. శని, ఆదివారాలతో పాటు 27, 28 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపింది. భారత ఎన్నికల సంఘం నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయగా.. అదే రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 30 వరకు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్తగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం-6, జాబితా నుంచి పేర్లు తొలగించడానికి, డబుల్ ఓటరుగా నమోదు అయినవారు ఫారం-7, తప్పులు సరిచేసుకోవడానికి ఫారం-8, ఒకే నియోజకవర్గంలో ఇతర అడ్రస్కు మార్పు చేసుకోవడానికి ఫారం- 8ఏ ఉపయోగించాలని సూచించారు. www.ceotelangana.nic.in , www.nvsp.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను డిసెంబర్ 20వ తేదీలోగా పరిష్కరించి, 2022 జనవరి 5న తుది జాబితాను ప్రదర్శించనున్నట్టు తెలిపారు.