బాన్సువాడ, జూలై 15 : గుంటూరు జిల్లాలోని బాపట్లలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనపై చీరాలకు వెళ్లిన ఆయన ఎన్టీఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కోర్సులు, వసతులు, బోధనా పద్ధతులు, పరిశోధనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొదట కళాశాలకు వెళ్లిన ఆయనకు జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ , జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, కళాశాల బృందం ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన సూచనలు, సలహాల కోసం బాపట్ల కళాశాలను సందర్శించినట్లు చెప్పారు. ఇక్కడ మౌలిక వసతులు, పరిశోధన, విభిన్న కోర్సులు ఉన్నాయని, వాటి గురించి తెలుసుకోవడానికి తన పర్యటన దోహదపడనున్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన నీరు, హరితహారం ద్వారా స్వచ్ఛమైన గాలిని అందించేలా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.