కామారెడ్డి : తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
జిల్లాలోని గాంధారి మండలం ముదెళ్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 30 డబుల్ బెడ్ రూం ఇండ్లకు స్థానిక ఎమ్మెల్యే జాజుల సురేందర్తో కలిసి భూమి పూజ చేసి మాట్లాడారు.
ధనికులు అయినా పేదలకు అయినా ఆత్మగౌరవం ఒక్కటే అన్నారు. పేదల ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్ బెడ్ రూం ఇండ్లను సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో ఇండ్ల నిర్మాణం కోసం ఏదో నామ్ కే వాస్తేగా డెబ్బై వేల రూపాయలు ఇచ్చారు.
కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం పేదలు అన్ని వసతులతో ఇళ్లు కట్టుకోవడానికి ఒక్కో ఇంటికి అయిదు లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని స్పీకర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగం కోసం 24 గంటలు ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.