లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఆదివారం క్షీణించింది. దీంతో హర్యానా గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్కు ఆయనను తరలించారు. ఐసీయూ వార్డులో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తండ్రి అయిన 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యం వల్ల గత కొన్నేళ్లుగా ఆయన ప్రజల్లోకి రాలేదు.
కాగా, ములాయం సింగ్ యాదవ్ కొన్ని వారాలుగా మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఐపీయూ వార్డులో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ సుశీల కటారియా ఆధ్వర్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీ చీఫ్, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ వెంటనే యూపీ నుంచి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ కూడా ఢిల్లీ సమీపంలో ఉన్న మేదాంత హాస్పిటల్కు బయలుదేరారు.