Monsoon : తీవ్రమైన ఎండలు, పొడి వాతావరణంతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు, రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు (Soutwest Monsoon) ప్రవేశించనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేశారు. ఈ నెల 10 నుంచి 12 మధ్య ఇవి తెలంగాణను తాకే అవకాశం ఉంది. ఈశాన్య అరేబియా సముద్రం, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు తుఫాను ఆవర్తనాలు (Cyclonic Circulations) ఈ రుతుపవనాల కదలికకు సానుకూలంగా మారాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్ 1 నాటికే రావాల్సిన రుతుపవనాలు ఈసారి మూడు రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. ప్రస్తుతం ఇవి తీరప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల గుండా వేగంగా ముందుకు సాగుతున్నాయి. దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ ప్రస్తుతం ఈ రుతుపవనాల రాక కోసం సిద్ధంగా ఉంది. రుతుపవనాల ద్రోణి వెంబడి ఏర్పడిన ఈ రెండు తుపాను ఆవర్తనాలవల్ల అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు ఈశాన్య దిశగా కదులుతున్నాయి.
అదే సమయంలో బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం చుట్టుపక్కల గాలిని తన వైపునకు లాక్కుంటోంది. ఈ రెండింటి కలయిక వల్ల మధ్య భారతదేశంపై మేఘాలు దట్టంగా కమ్ముకుని వర్షాలు కురిసే అవకాశం ఉంది. 11వ తేదీ నాటికి ఈ వ్యవస్థ మరింత బలపడి, తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాల రాక ఖరీఫ్ పంటలకు సిద్ధమవుతున్న రైతులకు ఎంతో ఊరటనివ్వనుంది.
అయితే ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో నీటి నిర్వహణపై రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.