హైదరాబాద్, మార్చి16 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని రోడ్ల సమస్యలు తీర్చాలని జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లోక్సభలో బుధవారం జీరోఅవర్లో ఆయన కంటోన్మెంట్లోని రోడ్ల విస్తరణ సమస్యలను ప్రస్తావించారు. కంటోన్మెంట్ ప్రాంతం నుంచే నాగపూర్, చంద్రపూర్ అంతర్రాష్ట్ర రహదారులు వెళ్తాయని తెలిపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు కంటోన్మెంట్ నుంచే రోడ్లు వెళ్తాయని తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతకంతకు పెరుగుతున్నదని, ఈ నేపథ్యంలో రహదారులను విస్తరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కంటోన్మెంట్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైఓవర్లు, స్కైవేలు, రోడ్ల విస్తరణ చేపట్టాలని ప్రతిపాదించిందని తెలిపారు. కానీ కంటోన్మెంట్ అధికారులు అనుమతులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. కంటోన్మెంట్ పరిధిలోని కొన్ని రోడ్లను కూడా మూసివేయడంతో స్థానిక ప్రజలు ముఖ్యంగా రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.