జ్యోతినగర్, నవంబర్ 25: కార్లను లీజుకు తీసుకొని ఇతరులకు విక్రయించిన ఘరానా మోసగాడిని పెద్దపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన గొర్రె రాజు తాను బీజేపీ నాయకుడినని, ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని, తనవద్ద కన్సల్టెన్సీలు ఉన్నాయని చెప్పుకునేవాడు. తన స్నేహితుడు సీపెల్లి వంశీకృష్ణ ద్వారా గోదావరిఖని, పెద్దపల్లి ప్రాంతాల్లో 14 కార్లను లీజుకు తీసుకున్నాడు. ఆ తరువాత వాటిని హైదరాబాద్, గన్నేరువరం, దండేపల్లి, కరీంనగర్, గోదావరిఖని ఏరియాలో ఇతరులకు తక్కువ ధరకు విక్రయించాడు. ఇలా వచ్చిన డబ్బులతో 8 నెలలుగా విలాస జీవితాన్ని గడుపుతున్నాడు. కార్లను లీజుకు ఇచ్చిన యజమానులకు అద్దె చెల్లించకపోవడం, కార్లు కొన్నవారికి ఆర్సీ ఇవ్వకపోవడంతో బాధితులు వారం క్రితం ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు గురువారం రామగుండం బీ పవర్హౌస్ వద్ద నిం దితుడిని పట్టుకొని 14కార్లను స్వాధీనం చేసుకొన్నారు.