న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు ఇవాళ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనతో పాటు తన కూతురుపై నిరాధార ఆరోపణలు చేశారని, రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని మంత్రి స్మృతి ఇరానీ తన పరువు నష్టం దావాలో డిమాండ్ చేశారు. 18 ఏళ్ల స్మృతి కూతురు గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తోందని ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దానికి సంబంధించిన ట్వీట్లు కూడా చేశారు. అయితే స్మృతి దావా నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లోగా ఆ ట్వీట్లను డిలీట్ చేయాలని ముగ్గుర్నీ ఆదేశించింది. ఒకవేళ ఆ ట్వీట్లను డిలీట్ చేయని పక్షంలో అప్పుడు ట్విట్టర్ సంస్థతో ఆ పని చేయాల్సి వస్తోందని కోర్టు తెలిపింది. పరువునష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఆగస్టు 18వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు. తన కూతురుపై ఆరోపణలు చేసిన అంశంలో ఎటువంటి షరతులు లేని క్షమాపణలు చెప్పాలని స్మృతి తన లీగల్ నోటీసులు పేర్కొన్నారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ రియాక్ట్ అయ్యారు. కోర్టు ముందు వాస్తవాలను ప్రజెంట్ చేస్తామని ఆయన తన ట్విట్టర్లో తెలిపారు. స్మృతి వేసిన దావాను కోర్టులోనే ఛాలెంజ్ చేస్తామని జయరాం అన్నారు.