న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూశారు. హర్యానా గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన క్యాన్సర్తో బాధపడుతుండగా.. ఇటీవల న్యుమోనియా బారినపడ్డారు. ఈ క్రమంలో రాత్రి 10.15 గంటల సమయంలో హాస్పిటల్లో ఉన్న ఆయనకు గుండెపోటు వచ్చింది. జస్టిస్ శాంతన గౌడర్ మే 5న, 1958లో కర్ణాటకలో జన్మించారు. సెప్టెంబర్ 1980లో న్యాయవాద వృత్తిలో చేరారు. శాంతన గౌడర్ ఉత్తర కర్ణాటకలోని ధర్వాడ్ న్యాయవాద వృత్తిని ప్రారంభించి.. సుప్రీం కోర్టు జడ్జి వరకు ఎదిగారు.
1991 నుంచి 1993 వరకు కర్ణాటక స్టేట్ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా, 1995-1996లో స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్గా పని చేశారు. 1999 నుంచి 2002 వరకు కర్ణాటక రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సైతం సేవలందించారు. 12, 2003న కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. సెప్టెంబర్ 24, 2004న శాశ్వత న్యాయమూర్తిగా నియామకమయ్యారు. తర్వాత ఆయన కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు. 2016, సెప్టెంబర్లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆ తర్వాత ఫిబ్రవరి, 2017లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. 2023 మే 4వ తేదీ వరకు శాంతన గౌడర్ కొనసాగాల్సి ఉన్నది. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం బారినపడి కన్నుమూశారు. ఇదిలా ఉండగా.. గతేడాది మృతి చెందిన ఆయన తల్లిని ఖననం చేసిన చోటనే తననూ ఖననం చేయాలనేది జస్టిస్ శాంతన గౌడర్ చివరి కోరిక అని కుటుంబీకులు తెలిపారు. ఆయన లింగాయత్ సమాజానికి చెందిన వారు కాగా.. ఈ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే ఖననం చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..