Real Estate Scam | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల రియల్ ఎస్టేట్ ముఠా చేతిలో చిక్కుకుని భారీగా నష్టపోయినట్లు తెలుస్తుంది. వికారాబాద్ జిల్లా కడ్మూర్ ప్రాంతంలో లాభదాయకమైన భూమి ఉందంటూ నమ్మబలికిన ఒక కేటుగాళ్ల ముఠా, ఆయనతో పాటు ఆయన మేనకోడలు శ్వేతను దారుణంగా వంచించారు. 2019లో మొదలైన ఈ వ్యవహారంలో, నిందితులు అత్యంత పక్కాగా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆ భూమి తమదేనని నమ్మించి వారిని బురిడీ కొట్టించారు. ఆ పత్రాలు అసలైనవేనని భావించిన శ్రీనువైట్ల, సదరు ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఏకంగా రూ.కోటి భారీ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తుంది. అయితే రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత తీరా ఆరా తీయగా, తాము కొనుగోలు చేసిన భూమికి, అమ్మిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని, నకిలీ పత్రాలతో తమను మోసం చేశారని ఆయన ఆలస్యంగా గుర్తించారు. పక్కా పథకం ప్రకారం జరిగిన ఈ కుట్రపై శ్రీనువైట్ల హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.