అభివృద్ధిలో ఆదర్శం కార్మికక్షేత్రం
మౌలిక వసతుల కల్పనలో బల్దియా టాప్
బెస్ట్ ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పురస్కారానికి ఎంపిక
ఇటీవలే హైదరాబాద్లో అవార్డులు స్వీకరించిన మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్
సిరిసిల్ల టౌన్, మే 25 : సిరిసిల్ల మున్సిపాలిటీ దూసుకెళ్తున్నది. జిల్లా కేంద్రాన్ని రాష్ర్టానికే ఆదర్శంగా నిలపాలన్న మంత్రి కేటీఆర్ సంకల్పానికి అనుగుణంగా పాలకవర్గం, అధికారయంత్రాంగం అలుపెరుగకుండా కృషిచేస్తున్నది. ఇందులో భాగంగా పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది.
సంతోషంగా ఉంది..
సిరిసిల్ల మున్సిపాలిటీలో వినూత్న మౌళిక సదుపాయాల కల్పనలో ఇటీవలే రాష్ట్ర స్థాయి పురస్కారం రావడం సంతోషంగా ఉంది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డును తీసుకోవడం మరింత ఆనందంగా ఉంది. అవార్డుతో మాపై బాధ్యత మరింత పెరిగింది. భవిష్యత్లో పట్టణ ప్రజలకు మరిన్ని వినూత్నమైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తాం.
– జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్ (సిరిసిల్ల)
పని తీరుకు గుర్తింపు..
మంత్రి కేటీఆర్ ఆశయానికి అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినం. అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీలేకుండా ముందుకుసాగినం. మా పనితీరుకు గుర్తింపే నేడు సిరిసిల్ల మున్సిపాలిటీకి వచ్చిన పట్టణ ప్రగతి పురస్కారం. మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– వెల్దండి సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ (సిరిసిల్ల)
మౌలిక సదుపాయాలు..
జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తర్వాత సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న కోట్లాది రూపాయల నిధులతో పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నది. ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్లో భాగంగా వాడవాడలా సీసీ రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి సరఫరాతో పాటుగా పట్టణ జనాభాకు అనుగుణంగా వార్డుల వారీగా పార్కులు, ఓపెన్జిమ్లను ఏర్పాటు చేసింది. విద్యానగర్ మానేరు తీరంలో బతుకమ్మ ఘాట్, మ్యూజికల్ ఫౌంటెయిన్, మోడ్రన్ రైతు బజార్, అంబేద్కర్, గాంధీ, ఎల్లమ్మ జంక్షన్ల సుందరీకరణ, కొత్త బస్టాండ్ ఆధునీకరణ, రైతు బజార్, ప్రభుత్వ దవాఖాన, కొత్త చెరువు, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు, విద్యానగర్, నెహ్రూనగర్ వైకుంఠధామాలు, డిజిటల్ లైబ్రరీ, సినారె ఆడిటోరియం, ఫుట్పాత్లు, వీధి వ్యాపారులకు దుకాణాలు, మోడ్రన్ దోభీఘాట్, కొత్త చెరువు, మినీ స్టేడియం వంటి అనేక మౌలిక సదుపాయాలను కల్పించారు.