విత్తనోత్పత్తికి జిల్లా అనుకూలం
సెరికల్చర్లో మొదటి స్థానం
సిద్దిపేట, డిసెంబర్ 25 : సీడ్ హబ్గా సిద్దిపేట జిల్లా మారనుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ సంస్థ నూతన భవన గోదాము నిర్మాణ పనులకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సిద్దిపేట జడ్పీ అధ్యక్షురాలు వేలేటీ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ ఎండీ కేశవతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్లో ఫిష్ స్టాల్, మార్కెడ్ యార్డ్లో వర్మీకంపోస్ట్ షెడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో సాధారణ పంట సాగుతో పాటు విత్తనోత్పత్తికి, విత్తన ప్రాసెసింగ్ కావాల్సిన వనరులు సిద్దిపేటలో పుష్కలంగా ఉండటంతో విత్తన ధ్రువీకరణ సేవలు విస్తృతం చేస్తున్నామని మంత్రి అన్నారు. నాణ్యమైన విత్తనాలను ధ్రువీకరించి సకాలంలో రైతులకు అందించడమే లక్ష్యమన్నారు. విత్తన కంపెనీలు రావడంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. కేంద్రం వడ్ల కొనని నేపథ్యంలో రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు సాగు చేయాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలో ఆయిల్ పామ్, సెరికల్చర్తో మంచి లాభాలున్నాయన్నారు. వీటితో పాటు పప్పు దినుసులు, పల్లి, నూనె గింజలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. రాష్ట్రంలో సిద్దిపేటలో 6వ సీడ్ కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు కానుందన్నారు. సిద్దిపేట జిల్లా పట్టు సాగులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు.
సిద్దిపేట సమీకృత మార్కెట్కు తొలి ఐఎస్వో సర్టిఫికెట్
రాష్ట్రంలోనే సిద్దిపేట సమీకృత మార్కెట్కు తొలి ఐఎస్వో సర్టిఫికెట్ రావడం సంతోషకరమని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇది జిల్లా ప్రజలందరికి గర్వకారణమన్నారు. రెండేండ్లుగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం అభివృద్ధి కృషి చేశారన్నారు. సర్టిఫికెట్ను పాల సాయిరాంకు మంత్రి అందజేశారు.
డిగ్రీ కళాశాల, ఏఎంసీ మధ్య ఎంఓయూ
సిద్దిపేట ప్రాంతంలో పండే వ్యవసాయ పంటలు, ధరలు, మార్కెట్ ప్రక్రియను ఇక డిగ్రీ క ళాశాల ఎకనామిక్స్ విద్యార్థులు అధ్యయం చేయనున్నారు. ఈ మేరకు ఏఎంసీ, డిగ్రీ కళాశాల మంత్రి హరీశ్రావు సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. మార్కెటింగ్ విధానాన్ని పరిశీలించడం ద్వారా విద్యర్థులు తమ నైపుణ్యం పెంచుకునేలా క్షేత్రస్థాయిలో అధ్యయన ఫలితాలను ఏఎంసీకి, ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయి రాం, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభాకర్ వర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, చిన్నకోడూర్ ఎంపీపీ మాణిక్యరెడ్డి, చిన్నకోడూర్, నంగునూర్ మార్కెట్ కమిటీల చైర్మన్లు సారయ్య, శ్రీనివాస్, సిద్దిపేట ఏఎంసీ వైస్ చైర్మన్ నందినిశ్రీను, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హమాలీలకు మంత్రి బట్టలు పంపిణీ చేశారు.