రామాయంపేట, జనవరి 18 : సుద్దవాగులోకి స్నానానికి దిగిన వ్యక్తి శవమై తేలిన ఘటన రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. రామాయంపేట పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తీగుళ్ల మల్లయ్య(46) తన వ్యసాయ బావి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం మూడు గంటలకు బావి వద్దకు స్నానానికి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు ఫోన్చేసినా ఎత్తలేదు. దీంతో బావి వద్దకు చేరుకుని వెతికారు. ఓ చెట్టుకింద మృతుడి సెల్ఫోన్, చెప్పు లు, బట్టలు కనిపించాయి. అనుమానంతో పక్కనే ఉన్న సుద్దవాగులోకి దిగి గాలించారు. దీంతో మల్లయ్య మృతదేహం కనిపించింది. వెంటనే మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజేశ్ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టన్ నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మల్లయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.