శ్రీశైలం : శ్రీశైలంలో రేపట్నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని ఈవో లవన్న తెలిపారు. ఆన్లైన్లో రూ. 500 అతి శీఘ్ర దర్శనం, రూ. 200 శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టికెట్లు పొందొచ్చని పేర్కొన్నారు.