న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుర్గావ్లో హీట్ వేవ్స్ కారణంగా ఎండలు దంచికొట్టాయి. బుధవారం ఢిల్లీలో గరిష్ఠంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ పాలమ్ అబ్జర్వేటరీ తెలిపింది. గుర్గావ్లో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండు నగరాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఏడు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. జూలై 7వ తేదీ వరకు రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, అప్పటి వరకు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. శుక్ర, శనివారాల్లో హీట్ వేవ్స్ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
దీంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయని పేర్కొంది. పొడి, పశ్చిమ వేడి గాలుల కారణంగా వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. ఒక్కసారిగా పెరిగిన ఎండలతో దేశ రాజధానిలో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ఎండ వేడిని తట్టుకోలేక ఎయిర్ కండిషన్ల వినియోగానికి వైపు మొగ్గు చూపారు. గరిష్ఠ విద్యుత్ డిమాండ్ బుధవారం 6,921 మెగావాట్లకు పెరిగిందని, ఈ వేసవిలో ఇప్పటి వరకు ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు.