KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్లో పానీపూరీ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వైద్యులు, అధికారులు, స్థానిక నాయకులకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ నగర్లో తోపుడు బండిపై విక్రయిస్తున్న పానీపూరి తిని 12 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దవాళ్లు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 12 మంది చిన్నారులు నిన్న రాత్రే సిరిసిల్ల ఆసుపత్రిలో చేరగా, ఈరోజు ఉదయం మరో ఏడుగురు పెద్దవారు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మొత్తం 19 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వీరికి ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని, అందరూ వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు కేటీఆర్కు వివరించారు. బాధితులంతా క్షేమంగా ఉన్నారన్న విషయం తనకు ఎంతో రిలీఫ్ ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ ఘటనలో అనారోగ్యం పాలైన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నాయకులు తోట ఆగయ్యకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాలని, వారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తూ పార్టీ తరఫున అండగా నిలవాలని సూచించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు సిరిసిల్ల ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా కలుషిత నీరు, బయట దొరికే చిరుతిండ్ల (స్ట్రీట్ ఫుడ్) విషయంలో పిల్లలు, పెద్దలు మరింత జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.