ఏడవ విడత హరితహారం విజయవంతం
వచ్చే ఏడాదికి యాక్షన్ ప్లాన్ రెడీ
తొలకరికి ముందే కోటి 25 లక్షల మొక్కలు సిద్ధం
మొక్కల పెంపకానికి 600 ప్రాంతాలు గుర్తింపు
కాలనీ, లేక్ ప్లాంటేషన్కు అత్యంత ప్రాధాన్యత
సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ) :
గ్రేటర్లో మరింత పచ్చదనం పెంపునకు జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక కార్యాచరణతో పర్యావరణహితంగా, పచ్చని నగరంగా హైదరాబాద్కు ప్రపంచంలోనే ప్రాముఖ్యతను తీసుకువచ్చారు. ఏడవ విడత హరితహారం(2020-21)లో కోటి 20 లక్షల నిర్ధేశిత టార్గెట్లో కోటి 9 లక్షలకు పైగా మొక్కలు నాటారు.
వంద శాతం గ్రీనరీ లక్ష్యంగా..
8వ విడతలో(2021-22) కోటి 25 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్శిటీ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. వంద శాతం గ్రీనరీ లక్ష్యంగా 900 కాలనీల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, వచ్చే నెలాఖరులోగా ఈ పనులను పూర్తి చేసి 8వ విడత హరితహారం మొక్కల పెంపకం పనులను ప్రారంభించి వచ్చే ఏడాది తొలకరి జల్లులు కురిసే నాటిని నిర్ధేశిత మొక్కలను సిద్ధం చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
కనువిందు చేస్తున్న ఎవెన్యూ ప్లాంటేషన్
గతంలో కంటే ఎక్కువ శాతం మొక్కలను నాటడంపై ప్రత్యేక దృష్టి సారించిన జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్శిటీ విభాగం ఖాళీ స్థలాలతో పాటు రహదారుల వెంబడి మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ విరివిగా చేపట్టనున్నారు. గతంలో ఉస్మానియా సెంట్రల్ యూనివర్శిటీ, ఎన్జీఆర్ఐలతో పాటు ఎక్కువ స్థలాలున్న సంస్థలు, ఖాళీ స్థలాలున్న దేవాదాయ శాఖ భూముల్లో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటారు. ప్రధానంగా రహదారుల వెంబడి, మెట్రో కారిడార్లో మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ కనువిందు చేస్తున్నది.
కోటి 25 లక్షల యాక్షన్ ప్లాన్ వివరాలు
600 ప్రాంతాల్లో కోటి 25 లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
17.20 లక్షల లేక్ ప్లాంటేషన్, రహదారుల వెంబడి మీడియన్, ఎంఎల్ఏపీ ప్లాంటేషన్ పనులు చేపడుతారు.
4200 కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు చేపట్టనున్నారు. కాలనీ ప్లాంటేషన్లో భాగంగా ఇప్పటికే 900కాలనీలకుగాను 454 కాలనీల్లో గ్రీనరీ పనులు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. కాలనీ ప్లాంటేషన్కు 68.85 లక్షల మొక్కలను సిద్ధం చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువుల వద్ద అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది లేక్ బ్యూటీఫికేషన్ పనుల్లో భాగంగా గ్రీనరీ పనులు చేపడుతున్నారు. వచ్చే ఏడాది కూడా దుర్గం చెరువు, మిరాలం ట్యాంక్, మల్కారం చెరువు, ఖాజాగూడ లేక్, దేవుడి కుంట చెరువు వద్ద 20.85 లక్షల మొక్కలు నాటనున్నారు.