న్యూఢిల్లీ : యూపీ లఖింపూర్ ఖేరిలో హింస సంఘటన అనంతరం అధికార బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నది. ఘటన వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపిస్తున్నది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ సైతం లఖింపూర్ను సందర్శించి, బాధితుల కుటుంబాలను ఓదార్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరింది. కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రపతిని కలువాలని, లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించిన వాస్తవాలను ఆయన ముందు ఉంచాలని భావిస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం కలుస్తుందని, లఖింపూర్ ఖేరీకి సంబంధించిన వాస్తవాలను చెప్పేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోని, మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి ఉన్నారు. ఇదిలా ఉండగా.. లఖింపూర్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రాను ఎట్టకేలకు శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నోటీసులు అందించిన తర్వాత శనివారం క్రైమ్బ్రాంచ్ ముందు విచారణకు హాజరయ్యాడు. విచారణలో సంఘటన జరిగిన సమయంలో ఆశిష్ ఎక్కడున్నాడో నిరూపించలేకపోయినట్లు తెలిసింది.