ముంబై, డిసెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు.. మదుపరుల్లో నెలకొన్న ఒమిక్రాన్ భయాలను తొలగించాయి. ఈ క్రమంలోనే మంగళవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 886.51 పాయింట్లు లేదా 1.56 శాతం పుంజుకుని 57,633.65 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 264.45 పాయింట్లు లేదా 1.56 శాతం ఎగిసి 17,176.70 వద్ద నిలిచింది.
అంతకుముందు రెండు రోజులు సూచీలు భారీ నష్టాలపాలైన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ కొత్త రకం ఒమిక్రాన్.. డెల్టా రకంతో పోల్చితే వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ పెద్దగా ప్రమాదకరం కాదన్న అధ్యయనాలు మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయని ఈ సందర్భంగా ట్రేడింగ్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మెటల్, బ్యాంకింగ్ షేర్లకు మదుపరుల నుంచి భారీ డిమాండ్ వ్యక్తమైందని, డాలర్తో పోల్చితే వరుసగా నష్టపోతున్న రూపాయి మారకం విలువ రికవరీ కూడా కలిసొచ్చిందని వారు చెప్తున్నారు.
ఇక సెన్సెక్స్లో టాటా స్టీల్ షేర్ విలువ అత్యధికంగా 3.63 శాతం ఎగబాకింది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఎస్బీఐ, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి. ఏషియన్ పెయింట్స్ షేర్ మాత్రం స్వల్పంగా 0.22 శాతం పడిపోయింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలూ 1.29 శాతం వరకు పెరిగాయి. ఇక ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలు లాభాల్లో ముగియగా, ఐరోపా ప్రధాన మార్కెట్లూ లాభాల్లోనే కదలాడాయి.
రూ.3.45 లక్షల కోట్లు జూమ్
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసిన నేపథ్యంలో మదుపరుల సంపద కూడా అదే స్థాయిలో పెరిగింది. మంగళవారం ఒక్కరోజే బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.3.45 లక్షల కోట్లు ఎగిసింది. దీంతో రూ.2,60,18,494.21 కోట్లకు చేరింది. నష్టాల కారణంగా అంతకుముందు రెండు రోజుల్లో రూ.5.4 లక్షల కోట్లకుపైగా మదుపరుల సంపద కరిగిపోయిన విషయం తెలిసిందే.