ముంబై, డిసెంబర్ 8: వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వుబ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చింది. గత కొన్ని రోజులుగా భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రారంభం నుంచే లాభాల్లో పయనించింది. ఒకవైపు ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్నప్పటికీ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడానికే మొగ్గుచూపడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఫలితంగా ఎగబడి కొనుగోళ్ళు జరుపడంతో ప్రారంభంలోనే వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. ఇది చివరి వరకు కొనసాగింది. వరుసగా రెండోరోజు 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 1,016.03 పాయింట్లు లేదా 1.76 శాతం లాభపడి మళ్లీ 58 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. చివరకు 58,649.68 వద్ద నిలిచింది. మార్చి 30 తర్వాత ఒకేరోజు ఇంతటి స్థాయిలో సెన్సెక్స్ లాభపడటం ఇదే తొలిసారి. అటు జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 293.05 పాయింట్లు (1.71 శాతం) అందుకొని 17,469.75 వద్ద స్థిరపడింది.
రూ.3.96 లక్షల కోట్లు పెరిగిన సంపద
మదుపరులు లాభాల్లో తడిసిముద్దయ్యారు. బుధవారం సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడంతో మదుపరుల సంపద రూ.3.96 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.2,64,15,418.11 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఇది రూ.2,60,18, 494.21 కోట్లుగా ఉన్నది. మార్కెట్లో 3,411 షేర్లు ట్రేడింగ్ జరుగగా..వీటిలో 2,313 షేర్లు లాభపడ్డాయి. దీంట్లో 224 స్టాక్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి.