ముంబై, జనవరి 20: విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరుపుతున్న కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడోరోజు పతనమయ్యింది. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 60,000 పాయింట్ల స్థాయిని కోల్పోయింది.ఇంట్రాడేలో 1,000 పాయింట్లకు పైగా పడిపోయిన ఈ సూచి 59 వేల సమీపాన్ని చేరింది. ట్రేడింగ్ చివరిగంటలో నష్టాల నుంచి కొంతమేర కోలుకుని, చివరకు 634 పాయింట్ల తగ్గుదలతో 59,465 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచి వరుసగా మూడు రోజుల్లో 1,835 పాయింట్ల తీవ్ర నష్టాన్ని చవిచూసింది. తాజాగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 181 పాయింట్లు పడిపోయి 17,757 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ ఇండెక్స్ 3 రోజుల్లో 550 పాయింట్లు కోల్పోయింది. క్రూడ్ ధర అమాంతం పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాలు.. మార్కెట్ వరుస నష్టాలకు కారణమని, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, రూపాయి విలువ క్షీణించడంతో సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం పడుతున్నదని దలాల్ స్ట్రీట్ వర్గాలు తెలిపారు.
విదేశీ ఇన్వెస్టర్ల భారీ విక్రయాలు
గత రెండు రోజుల్లో రూ. 3,960 కోట్ల వరకూ షేర్లను విక్రయించిన ఎఫ్పీఐలు గురువారం భారీగా రూ.4,680 కోట్లు పెట్టుబడులను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నట్లు ఎన్ఎస్ఈ ప్రాథమిక డాటా వెల్లడిస్తున్నది.
6.80 లక్షల కోట్ల సంపద నష్టం
వరుసగా మూడు రోజులపాటు జరిగిన మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు రూ.6.80 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ జనవరి 17-20 మధ్యకాలంలో రూ.6,80,441 కోట్లు తగ్గి రూ.2,73,21,997 కోట్ల వద్ద నిలిచింది.