హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు. ఆయనవల్లే రాష్ట్రం లో పార్టీ నాశనం అవుతున్నదంటూ ఘాటు వ్యాఖ్యలుచేశారు. మరోవైపు ఆయనకు సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ దొంగనాటకాలు అడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సోమవారం లేఖ రాశారు. రేవంత్రెడ్డి, ఆయన వర్గం తనను టార్గెట్ చేసి కావాలనే ప్రతిచోట అవమానిస్తున్నారని పేర్కొన్నారు. తన మనోభావాలను దెబ్బతీశారని, అందుకే మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు స్పష్టంచేశారు. మునుగోడు ఉప ఎన్నికపై ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశానికి వెంకట్రెడ్డి అక్కడే ఉన్నప్పటికీ డుమ్మా కొట్టారు. ఆయన ఇక పార్టీతో, రేవంత్రెడ్డితో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.