గోదావరిఖని, మే 9: దళిత దళారీ వెంకటస్వామి కుటుంబానికి ఓటుతో బుద్ధి చెప్పాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గాంధీచౌక్ వద్ద గల బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోట్లకు పడగెత్తిన కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి కుటుంబీకులు పెద్దపల్లి జిల్లాను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వారి అక్రమ ఆస్తులను రేవంత్రెడ్డికి అప్పనంగా కట్టబెట్టి కుటుంబం మొత్తం పదవులను అనుభవిస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ పాలనకు తెరలేపుతున్న రేవంత్రెడ్డికి ఓటు ద్వారనే బుద్ధి చెప్పాలని సూచించారు.కాకా కుటుంబం జనరల్ స్థానాల్లో పోటీ చేసి ఇక్కడ మరో దళితుడికి అవకాశం కల్పించకుండా దళితులను మోసం చేస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటువేసి దళిత ముసుగులో ఉన్న దళారులను పెద్దపల్లి నుంచి తరిమికొట్టాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు యాసర్ల రాజ్కుమార్,మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మధురాజు, ఎంఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఈర్ల ప్రేమ్కుమార్, మాచర్ల శ్రీనివాస్, నాగరాజు, మల్లేశ్, మధునయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.