Modi-Rahul Gandhi | న్యూఢిల్లీ, మే 9: లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక తటస్థ వేదికపై బహిరంగ చర్చకు రావాలని ఒక ప్రముఖ పాత్రికేయుడు, ఇద్దరు మాజీ న్యాయమూర్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ద హిందూ మాజీ సంపాదకుడు ఎన్ రామ్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షాలు నేతలిద్దరికీ లేఖలు రాశారు.
వాణిజ్యేతర, పార్టీయేతర వేదికపై ఈ చర్చను జరపాలని, ఇలాంటి బహిరంగ చర్చ కారణంగా ప్రజలకు అవగాహన ఏర్పడటమే కాకుండా ఒక ఆరోగ్యకరమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శించడంలో గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. ఒక వేళ వారికి పాల్గొనేందుకు వీలులేకపోతే తమ ప్రతినిధులనైనా ఈ బహిరంగ చర్చకు పంపాలని వారు కోరారు.