తాండూర్, ఏప్రిల్ 28 : మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ పరిధి కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.24 లక్షల విలువైన 12 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ వెల్లడించారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు కన్నెపల్లి ఎస్ఐ సురేశ్వర్మ, కన్నెపల్లి ఏవో శ్రీకాంత్తో కలిసి ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జనకపూర్ క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నామన్నారు.
అనుమానాస్పదంగా బొలెరో వాహనం కొద్ది దూరంలో నిలిపి డ్రైవర్ పారిపోయారని పేర్కొన్నారు. ఆ వాహనంలో 50 కిలోల బరువున్న 22 నకిలీ పత్తి విత్తనాల సంచులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ చెప్పారు. వాటి విలువ రూ.24 లక్షల వరకు ఉంటుందన్నారు. పారిపోయిన వ్యక్తి గురించి విచారణ చేయగా.. మంచిర్యాలకు చెందిన పులికొండ యశ్వంత్ వెంకటకృష్ణ కుమార్ మంచిర్యాలలో గన్నీ సంచుల వ్యాపారం చేస్తుండేవాడని, వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం చేస్తున్నాడన్నారు.
ఇతనికి ఆంధ్రప్రదేశ్కు చెందిన జగన్తో పరిచయం ఏర్పడిందని, అతని నుంచి తక్కువ ధరకు నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి స్థానికంగా రైతులకు అంట గట్టేందుకు పూనుకున్నాడని వివరించారు. ఈ క్రమంలోనే జగన్ చెప్పిన విధంగా వెంకటకృష్ణ డ్రైవర్లు అజయ్, సుభాష్ కర్ణాటక రాష్ట్రంలోని సింగనూర్ వెళ్లి 12 క్వింటాళ్ల విత్తనాలను బొలెరో వాహనంలో మంచిర్యాలకు తీసుకొచ్చారన్నారు.
అక్కడి నుంచి 11 క్వింటాళ్లు కన్నెపల్లికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ఈ అక్రమ దందాలో ప్రమేయం ఉన్న మరింత మంది కోసం మరింత లోతుగా విచారణ చేపడుతున్నట్లు ఏసీపీ తెలిపారు. నిషేధిత పత్తి విత్తనాలు పట్టుకోవడంలో కృషి చేసిన తాండూర్ సీఐ జగదీశ్, కన్నెపల్లి ఎస్ఐ సురేశ్వర్మను ఆయన అభినందించారు.