హైదరాబాద్: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్పై (MP Asaduddin Owaisi) కాల్పుల ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ప్రార్థనలు కావడంతో ముందు జాగ్రత్తగా పాతబస్తీలో పోలీసు బలగాలను మోహరించారు. పాతబస్తీలో సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచారు. చారిన్మార్, దానిపరిసర ప్రాంతాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకున్న అసద్.. హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా చిజారసీ టోల్ప్లాజా వద్ద ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని నేడు కోర్టులో హాజరు పరుచనున్నారు.
కాగా, కాల్పుల ఘటన నేపథ్యంలో ఒవైసీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసద్ భద్రతపై సమీక్ష నిర్వహించిన కేంద్ర హోం శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.