వారం రోజుల క్రితం మొదలైన ఐపీఎల్లో సొంత మైదానంలో ఆడుతున్న మ్యాచ్లను గెలుస్తున్న ఆతిథ్య జట్ల సంప్రదాయాన్ని రాజస్థాన్ తమ మలి పోరులోనూ కొనసాగించింది. జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో టాపార్డర్ విఫలమైనా రియాన్ పరాగ్ మెరుపులకు తోడు బౌలర్ల సమిష్టి ప్రదర్శన తోడై రెండో విజయాన్ని నమోదు చేసింది. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్లో గెలవాలన్న కసితో కాకుండా ఏదో మ్యాచ్ ముగిసిపోతే బాగుండు అన్నట్టుగా ఆడింది. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు.
జైపూర్: ఏడాది కాలంగా దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న అస్సాం కుర్రాడు రియాన్ పరాగ్ మెరుపులకు తోడు బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఐపీఎల్ -17 సీజన్లో రాజస్థాన్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్ను 12 పరుగుల తేడాతో గెలుచుకుంది. రాజస్థాన్ టాపార్డర్ విఫలమైనా పరాగ్ (45 బంతుల్లో 84 నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో ఢిల్లీ.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 49, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించగా ట్రిస్టన స్టబ్స్ (23 బంతుల్లో 44 నాటౌట్, 2 ఫోర్లు,3 సిక్సర్లు) ఆఖర్లో పోరాడాడు. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. పరాగ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
టాపార్డర్ తుస్..
తొలుత రాజస్థాన్కు మరోసారి ఆశించిన ఆరంభం దక్కలేదు. గత సీజన్ నుంచి వైఫల్యాల బాట పట్టిన జోస్ బట్లర్(11) ,యశస్వీ జైస్వాల్ (5),కెప్టెన్ శాంసన్ (15).. రాజస్థాన్ 57/3 స్కోరుకు పరిమితమైంది.
పరాగ్ ఒక్కడే..
నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన పరాగ్ ఆరంభంలో నెమ్మదిగానే ఆడాడు. తొలి 26 బంతుల్లో అతడు చేసినవి 26 పరుగులే. కానీ బ్యాటింగ్లో ప్రమోషన్ పొంది ఐదో స్థానంలో వచ్చిన స్టార్ స్పిన్నర్ అశ్విన్ (19 బంతుల్లో 29, 3 సిక్సర్లు) ఉన్నంతసేపు స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అశ్విన్ – పరాగ్ల ద్వయం 37 బంతుల్లోనే 54 పరుగులు జతచేసింది. అశ్విన్ ఔట్ అయ్యాక పరాగ్ గేర్ మార్చాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 15వ ఓవర్లో 6, 4, 4తో బాదుడుకు శ్రీకారం చుట్టాడు. ధ్రువ్ జురెల్ కూడా ఓ చేయి వేయడంతో రాజస్థాన్ స్కోరు వేగం పుంజుకుంది.
జురెల్తో ఐదో వికెట్కు పరాగ్ 23 బంతుల్లోనే 52 రన్స్ జోడించాడు. ముకేశ్ వేసిన 16 ఓవర్ ఆఖరిబంతికి సిక్సర్ బాదిన పరాగ్.. 34 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. నోకియా వేసిన ఆఖరి ఓవర్లో పరాగ్.. 4, 4, 6, 4, 6, 1 తో విధ్వంసం సృష్టించడంతో రాజస్తాన్ భారీ స్కోరు చేసింది. మొదటి 10 ఓవర్లలో 57 పరుగులే చేసిన ఆ జట్టు ఆఖరి 60 బంతుల్లో 128 రన్స్ రాబట్టింది. ఇందులో పరాగ్వే 72 కావడం విశేషం. ఆరంభంలో 26 బంతుల్లో 26 రన్స్ చేసిన అతడు.. చివరి 19 బంతుల్లో 58 పరుగులు దండుకున్నాడు. ఐపీఎల్లో అతడికి ఇదే అత్యుత్తమ స్కోరు.
ఢిల్లీ పోరాడినా..
ఛేదనను ఢిల్లీ దూకుడుగానే ఆరంభించింది. నండ్రె బర్గర్ వేసిన రెండో ఓవర్లోనే మిచెల్ మార్ష్ మూడు ఫోర్లు బాదాడు. కానీ బర్గర్ ఢిల్లీకి ఒకే ఓవర్లో రెండు షాకులిచ్చాడు. మార్ష్తో పాటు భుయ్ను వెనక్కిపంపాడు. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ పంత్ (26 బంతుల్లో 28, 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్కు 67 పరుగులు జతచేసి ఢిల్లీని పోటీలోకి తెచ్చాడు. బౌల్ట్, బర్గర్ బౌలింగ్లలో వార్నర్ భారీ షాట్లతో అలరించాడు. కానీ అవేశ్ ఖాన్ ఈ జోడీని విడదీశాడు. అతడు వేసిన 12వ ఓవర్లో వార్నర్.. సందీప్ శర్మకు చిక్కాడు. పంత్తో పాటు అభిషెక్ పొరెల్ (9)లను చాహల్ పెవిలియన్కు పంపాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్.. అశ్విన్ బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదగా సందీప్ వేసిన 19వ ఓవర్లో 6,4తో ఢిల్లీలో ఆశలు రేపాడు. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం ఉండగా అవేశ్ ఖాన్ వేసిన ఆ ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు.