ముంబై : ఇప్పుడిప్పుడే దేశం కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న భారత్లో మాత్రం రోజు రోజుకు కొవిడ్ తగ్గుముఖం పడుతున్నది. ఈ క్రమంలో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ తరుణంలోనే ఓ మహిళకు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ వేరియంట్ తొలి కేసు ముంబైలో నమోదైందని, బీఎంసీ అధికారులు సైతం ధ్రువీకరించడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. కొత్త వేరియంట్తో ప్రస్తుతం ఉన్న ఒమిక్రాన్ కంటే పది రెట్లు వేగంగా వ్యాప్తిచెందుతుందన్న వార్తలతో.. మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అయితే, మహిళకు ఎక్స్ఈ వేరియంట్ పాజిటివ్ కేసు జన్యు విశ్లేషణను ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే, విశ్లేషణలో ఇప్పటి వరకు ఎక్స్ఈ వేరియంట్ అని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సదరు మహిళ ఫిబ్రవరి చివరలో దక్షిణాఫ్రికా నుంచి రాగా.. మార్చిలో కొవిడ్-19కు పాజిటివ్గా పరీక్షించింది. అయితే, ఈ మహిళకు ఎక్స్ఈ వేరియంట్ సోకిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం ప్రకటించింది. ఈ వేరియంట్ తొలి కేసు యూకేలో గుర్తించారు.
ప్రస్తుతం ఉన్న నివేదికలు ఎక్స్ఈ వేరియంట్ అనేందుకు ఎలాంటి ఆధారాలు సూచించలేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) నిపుణులు శాంపిల్ ఫాస్ట్క్యూ ఫైల్స్ను పరిశీలించారు. సదరు మహిళకు సోకిన వేరియంట్ జన్యూ కూర్పు.. ఎక్స్ఈ వేరియంట్ జన్యూ కూర్పుతో సరిపోలడం లేదని గుర్తించినట్లు ఓ అధికారి తెలిపారు. బీఎంసీ ప్రకటన తర్వాత ఐఎన్ఎస్ఏసీఓజీ (INSACOG) కేసు జన్యూ విశ్లేషణ చేస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మరో వైపు బీఎంసీ సెరో సర్వేలో కప్పా వేరియంట్ సైతం గుర్తించారు. స్థానిక జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లో 11వ బ్యాచ్లో 376 నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు బుధవారం వెలువడగా.. సర్వే ప్రకారం ముంబై నుంచి వచ్చిన 230 నమూనాల్లో 99.13శాతం అంటే.. 228 ఒమిక్రాన్ వేరియంట్గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ కస్తూర్బా హాస్పిటల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లో ఈ 376 నమూనాలను పరిశీలించారు. అయితే, కొత్త వేరియంట్ సోకిన బాధితుల ఆరోగ్యంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.