సైదాబాద్ : కొవిడ్ మహమ్మూరి మూలంగా ఏడాదిన్నర కాలం తర్వాత బుధవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. మలక్పేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు స్కూల్కు వెళ్లడానికి అసక్తి చూపించగా, ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు స్కూల్స్ ఓపెన్ చేయడానికి మొదటి రోజు అసక్తి చూపించకపోవటంతో విద్యార్ధులు ఇళ్లకే పరిమితమయ్యారు. స్కూల్స్కు వెళ్ల్లి చదువుకోవాలని ఎంతో సంబుర పడిన విద్యార్ధులకు నిరాశే మిగిలింది.
రోజువారి మాదిరిగానే ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసులను నిర్వహించటంతో వారు ఇంటికే పరిమితమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనల మేరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా యజమాన్యాలు తగు చర్యలు తీసుకున్నప్పటికీ విద్యార్ధులను స్కూళ్లకు పంపించటానికి సంసిద్దంగా లేకపోవటంతో చాల స్కూళ్లు ఆన్లైన్ తరగతులను నిర్వహించాయి. విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం ఉహించిన దానికంటే తక్కువ శాతంలో స్కూళ్లు తెరుచుకున్నాయి.
సైదాబాద్ మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధుల సంఖ్య 2560 ఉండగా, 349 మంది 13.63 శాతం విద్యార్ధులు హాజరయ్యారు. అదే విధంగా ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులు 623 మంది విద్యార్ధులుండగా 41 మంది హాజరై 6.58శాతం మంది విద్యార్ధులు హజరయ్యారు. మొదటిరోజు తెరుచుకున్న సూళ్లకు వచ్చిన విద్యార్ధులకు కొవిడ్ జాగ్రత్తలను వివరించటమే కాకుండా విద్యార్ధుల శరీర ఉష్ణోగ్రతలు, శానిటైజేషన్ చేయించి, మాస్కులు ధరించిన వారితో ప్రార్ధన చేయించారు. అదే విధంగా గదుల్లో భౌతిక దూరం పాటిస్తూ దూరదూరంగా కూర్చున్నారు.