అక్కెనపల్లి శివజ్యోతి.. ఓ ట్యూషన్ టీచర్. లెక్కల స్పెషలిస్ట్. విద్యార్థికి మరో విద్యార్థి చెబితేనే పాఠం తలకెక్కుతుందని బలంగా నమ్ముతుందామె. అలా జ్యోతి తయారు చేయించిన లెక్కల పాఠాలను లెక్కలేనంత మంది విద్యార్థులు వీడియోల ద్వారా చూస్తున్నారు, వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఆ ప్రతిభే శివజ్యోతికి రాష్ట్ర విద్యా శిక్షణ, పరిశోధన సంస్థ వేదికపై ప్రసంగించే అవకాశం కల్పించింది.
శివజ్యోతి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. అయినా బిడ్డను చదివించేందుకు వెనుకడుగు వేశాడు. మేమున్నామంటూ మేనమామలు ముందుకొచ్చారు. ఆదుకున్నారు. కానీ, ఆమెకు ఆత్మాభిమానం ఎక్కువ. తన పుస్తకాలకు తానే సంపాదించుకోవాలని అనుకుంది. ట్యూషన్లు ప్రారంభించింది. 20 సంవత్సరాల క్రితం ఇద్దరు ముగ్గురితో మొదలైన ఆ ట్యూషన్ ఇప్పుడు 150 మందికి చేరుకుంది. సమాంతరంగా ఆమె చదువు కూడా పూర్తయింది. ఎమ్మెస్సీ (గణితం)లో బంగారు పతకం సాధించింది. బీయీడీ కూడా పూర్తిచేసింది. ఈ విజయం వెనుక.. అపారమైన కృషి ఉంది. గణిత పాఠాలు కొత్తగా చెప్పాలన్న తపన ఉంది. కరీంనగర్ జిల్లా నుంచి ఎస్సీఈఆర్టీ మ్యాథ్స్ సెమినార్కు ఎంపికైన బోయవాడకు చెందిన అక్కెనపల్లి శివజ్యోతి.. విద్యార్థుల పాలిట లెక్కల అక్క!
ఇంటికో ప్రయోగశాల..
విద్యార్థులకు గణితం అంటే అర్థం లేని భయం. దీంతో ఇష్టంగా చదువుకోలేక పోతున్నారు. అత్తెసరు మార్కులతో గట్టెక్కుతున్నారు. మ్యాథ్స్ ఫోబియాతో బడి మానేస్తున్నవారూ ఎంతోమంది. తన దగ్గర ట్యూషన్లకు వచ్చే విద్యార్థులకు మాత్రం ఈ పరిస్థితి రాకూడదని అనుకున్నది శివజ్యోతి. సంక్లిష్టమైన గణిత సూత్రాలకు అతి సులువైన ఫార్ములాలు తయారుచేయడం మొదలుపెట్టింది. విద్యార్థుల ద్వారానే వాటిని వివరిస్తూ.. వీడియోలు తయారుచేయించి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. ఎక్కాలు, కూడికలు, తీసివేతలు, భాగహారం మొదట ఇంటర్మీడియట్ వరకూ తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో దాదాపు 1,000 వీడియోలను సిద్ధం చేసింది. తన కార్యక్రమాలు పేద విద్యార్థులకు అందేలా ‘భరోసా’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. ఎనిమిదో తరగతి విద్యార్థులు ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్’ కోసం రాసే అర్హత పరీక్షకు మార్గదర్శనం చేస్తున్నది జ్యోతి. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ సందర్శిస్తూ, ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు సలహాలు, సూచనలు అందిస్తున్నది. అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి, వారికి భవిష్యత్తు అవకాశాల పట్ల అవగాహన కల్పిస్తున్నది. ‘చిన్నప్పుడు నేను చదువుకోవడానికి అనేక ఇబ్బందులను ఎదురొన్నాను. నా కష్టం ఇతరులకు ఎదురుకావద్దనే ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించాను. నేను సాయపడుతున్న విద్యార్థుల్లో కొందరైనా తిరిగి ఇతరులకు అండగా నిలబడాలన్నదే నా కోరిక’ అంటున్నది శివజ్యోతి.
ఉపాధ్యాయుల సెమినార్లో ..
తెలంగాణ రాష్ట్ర విద్యా శిక్షణ, పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ) డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఓ సెమినార్ నిర్వహించింది. శివజ్యోతికి ఇందులో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది. ‘విద్యార్థులందరినీ ఒకే రకంగా చూడాలి. చదివే వారిని ఒకలా, చదవని వారిని మరోలా చూడకూడదు. బడిలో వివక్ష పనికిరాదు. విద్యార్థుల అవగాహన సామర్థ్యం వేరువేరుగా ఉంటుంది. మనమే వాళ్ల స్థాయికి వెళ్లి పాఠాలు బోధించాలి. నిజానికి, ఒక సగటు విద్యార్థికి ఉపాధ్యాయుడు చెప్పినప్పటి కంటే, తోటి విద్యార్థి చెప్పినప్పుడే బాగా అర్థం అవుతుంది. పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం చివరా ఓ క్యూర్ కోడ్ ఇవ్వాలి. దానిపై క్లిక్ చేయగానే.. పిల్లలే పిల్లలకు పాఠాలు చెప్పే వీడియో ప్రత్యక్షం కావాలి’ అంటూ శివజ్యోతి చేసిన సూచన విద్యావేత్తలను ఆలోచింపజేసింది. వేదిక మీద చెప్పడమే కాదు, ఆచరించి చూపింది కూడా. అతి సులువుగా గణితాన్ని బోధించడం గురించి పిల్లలకు ఓ పోటీ నిర్వహించింది. దాదాపు ఏడువేల మంది బాలలు ఈ చిక్కు లెక్కల పోటీలో పాల్గొన్నారు. సింగపూర్ లాంటి దేశాల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. వివిధ విభాగాల్లో ఎంపికైన వీడియోలకు బహుమతులు ప్రకటించింది శివజ్యోతి. కార్పొరేట్ పాఠశాలల నుంచి వేల జీతాల ఊరింపులు వస్తున్నా, ఆమె సున్నితంగా తిరస్కరించింది. ట్యూషన్ టీచర్గా, లెక్కల అక్కగా తాను పొందే ఆనందాన్ని డబ్బుతో దూరం చేయవద్దని చెప్పింది.